జగన్పై మండిపడ్డ చిరంజీవి, 28న ఏమైనా జరగొచ్చు
నిమ్మగడ్డ ప్రసాద్, సత్యం రామలింగరాజులను కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం బలి చేశారన్నారు. పారిశ్రామికవేత్తలకు ఆశలు చూపించి ప్రలోభ పెట్టి జైళ్లకు వెళ్లేందుకు కారకులయ్యారన్నారు. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు రాకపోవడానికి కారకులయ్యారన్నారు. పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే స్థితికి తీసుకు వచ్చారన్నారు.
అవినీతి, అక్రమాల బురదలో కూరుకుపోయిన వారు తమకూ ఆ బురద అంటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల గందరగోళానికి కొందరి అధికార దాహమే కారణమన్నారు.
చెన్నైలోని తన బంధువు ఇంట్లో దొరికిన డబ్బుపై సాక్షి పత్రిక రాసిన కథనాలపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని అన్నారు. వారితో చర్చించిన అనంతరం కోర్టుకు వెళ్తామని చెప్పారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాలలో ప్రచారం చేసేందుకు తాను వెళుతున్నానని, అందుకే తిరుపతి మీదుగా వచ్చానని చెప్పారు.
ఈ నెల 28 తర్వాత ఏమైనా జరగవచ్చునని చిరంజీవి అన్నారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ తన విధానాన్ని పాటిస్తోందన్నారు. చెన్నైలోని తన బంధువు ఇంట్లో దొరికిన సొమ్ముతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాగా ఈ నెల 28న కోర్టుకు హాజరు కావాలని జగన్కు సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే.