చేసిన తప్పేంటో అర్థం కాలేదు: మ్యాట్రిక్స్ ప్రసాద్పై జగన్
నిమ్మగడ్డ అరెస్టుపై జగన్ తొలిసారి స్పందించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై రాజకీయ కుట్రలు పన్నుతున్నాయన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. అధికార పార్టీ నాయకులు సిబిఐ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. పేదలు, రైతుల కోసం పదవులను త్యాగం చేసిన ఓ ఎంపి, పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
ఈ ఎన్నికలు రాష్ట్రంలో మార్పునకు నాంది పలకాలని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసుతోనే పేదోడి కలలు సాకారమవుతాయన్నారు. 108, 104 పథకాలు సక్రమంగా పని చేయడం లేదని ఆరోపించారు. శాసనసభ్యులు రైతుల పక్షాన నిలిచి పదవులకు రాజీనామా చేయడం సామాన్య విషయం కాదన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ చేసిన తప్పేంటని జగన్ సిబిఐని ప్రశ్నించారు. సాక్షిలో పెట్టుబడులు పెడితే బజారుకీడ్చి పరువు తీస్తారా అన్నారు.
ఆయన చేసిన తప్పేంటో నాకు అర్థం కాలేదన్నారు. ప్రసాద్ రస్ ఆల్ ఖైమాలో యాధృచ్చితంగా పెట్టుబడులు పెడితే తప్పా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కృష్ణపట్నం పోర్టు ఇస్తే తప్పు కాదు, కాకినాడ పోర్టు ఇచ్చినప్పుడు తప్పు కాదు, గంగవరం పోర్టు ఇచ్చినప్పుడు కూడా తప్పు కాదా అని మండిపడ్డారు. కాంగ్రెసు, చంద్రబాబులు ఒక్కటై వైయస్ను అప్రతిష్ట పాలు చేసే కుట్ర చేస్తున్నారన్నారు.