సాక్షి మీడియా పిఎఫ్ ఖాతాలు అడిగిన కోర్టు
జగతి పబ్లికేషన్స్ (సాక్షి దినపత్రిక), ఇందిరా టెలివిజన్ (సాక్షి టీవీ) పిఎఫ్ ఖాతాలను సిద్ధం చేసినట్లు పిఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలను పిఎఫ్ కార్యాలయం సిబిఐ కోర్టుకు సమర్పించింది. అయితే, కోర్టు మరిన్ని వివరాలను అడిగింది. పిఎఫ్ రికార్డుల ప్రకారం - జగతికి ఎనిమిది పిఎఫ్ ఖాతాలున్నట్లు, ఇందిరా టెలివిజన్కు ఐదు ఖాతాలున్నట్లు తెలుస్తోంది.
కాగా సాక్షి పత్రికలో 14 వేల మంది ఉద్యోగులున్నారు. సాక్షి టీవీలో ఐదు వేల మంది ఉద్యోగులున్నారు. మొత్తం 19 వేల మంది ఉద్యోగులున్నట్లు ఓ అంచనా. ఓ వారంలో ఇందుకు సంబంధించి కచ్చితమైన లెక్క రాగలదని భావిస్తున్నారు. తమ సంస్థల్లో 20 వేలకు పైగా ఉద్యోగులున్నారని సాక్షి మీడియా యాజమాన్యం చెబుతున్న విషయాన్ని సిబిఐ నమ్మడం లేదని, సంఖ్యను ఎక్కువ చేసి చూపుతోందని భావిస్తోందని అంటున్నారు.
కాగా, సాక్షి మీడియా బ్యాంక్ ఖాతాల స్తంభన నేపథ్యంలో ఉద్యోగుల భద్రతపై యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రచారానికి దిగింది. ఉద్యోగుల భద్రతకు సంబంధించి సాక్షి మీడియాపై చర్యలను వ్యతిరేకిస్తూ జర్నలిస్టులు, ప్రజా సంఘాల కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి మీడియాలోని ఉద్యోగుల కచ్చితమైన లెక్కను కోర్టు అడిగినట్లు భావిస్తున్నారు.