జగన్తో కెసిఆర్ కుమ్మక్కై రెచ్చగొడుతున్నారు: కిరణ్
వరంగల్ జిల్లా పరకాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లాలోని ఆత్మకూరు మండలం గూడెప్పాడులో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పిసిసి చీఫ్ బొత్సతో కలిసి ఆయన పాల్గొన్నారు. అకాల గాలివాన బీభత్సంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. దీంతో కాలేజీ ఆవరణలోనే మీడియా సమావేశం నిర్వహిం చారు.
అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు జగన్తో కెసిఆర్ మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం ఏ సంస్థపైనా, వ్యక్తిపైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదని అన్నారు. గత ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులపై సిబిఐ నిష్పాక్షిక విచారణ జరుపుతోందని ఆయన వెల్లడించారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే మంత్రులు, అధికారులు నడుచుకున్నారని అభిప్రాయపడ్డారు. అయినా వారికి క్లీన్చిట్ ఇచ్చేది తాను కాదని, దర్యాప్తు సంస్థలే ఆ పని చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమస్యలు సృష్టించేందుకు భిన్నధ్రువాలైన పార్టీలన్నీ ఏకమై కుట్ర పన్నుతున్నాయని ఆయన అన్నారు.
ప్రాంతీయ తత్వం, మతతత్వం, అవినీతితో రాష్ట్రాన్ని చీల్చేందుకు ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కులం, మతం, ప్రాంతీయ వాదంతో ప్రజలను రెచ్చగొట్టడం సులభమని, అభివృద్ధే శాశ్వతమని దివంగత ప్రధాని ఇందిర ఎప్పుడో చెప్పారని ఆయన అన్నారు. ఏమైనా అభివృద్ధే శాశ్వతమని ఆయన అన్నారు. తెరాస 'తెలంగాణ నినాదం'తో ఎన్నికలకు వెళుతున్నా దాని ప్రభావం గతంలో కన్నా 15 శాతం తగ్గిపోయందని విశ్లేషించారు. కాగా, ఉప ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండం కావన్నారు. 2014 ఎన్నికల నాటికి ప్రజల ఆలోచనల్లో, భావనల్లో మార్పులు రాబోవనని, అప్పుడు వారి తీర్పు వేరుగా ఉండదని చెప్పలేమని వివరించారు.
వైయస్ జగన్ మీడియాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే విమర్శను ఆయన కొట్టివేశారు. ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని, అప్పటి ప్రభుత్వంలో అధికారం అడ్డంపెట్టుకుని కొందరికి మేళ్లు చేసి అందుకు ప్రతిఫలంగా భారీగా డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని, వాటి ఆధారంగానే కొన్ని సంస్థలపై విచారణ జరుగుతోందని కిరణ్ వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులకు కృష్ణా నీళ్లు ఇవ్వకుంటే ఉద్యమిస్తానన్న కెసిఆర్ హెచ్చరికను సీఎం తోసిపుచ్చారు. కృష్ణాజలాలను అడ్డంపెట్టుకొని నీటి రాజకీయాలు చేయడం తగదని, ఈ జలాలపై ట్రిబ్యునల్లో విచారణ జరుగుతోందని, కృష్ణా జలాలపై గతంలో అన్ని పార్టీలతో చర్చించామని, అవసరమైతే మరోసారి అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని ఆయన అన్నారు.