రామచంద్రాపురం: పుంజుకుంటున్న టిడిపి చిక్కాల
కాపు ఓట్లను చిక్కాల రామచంద్రా రావు చీలుస్తారని భావిస్తున్నారు. దీంతో చిక్కాల రామచంద్రా రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్కు, కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేదనే స్థితి నుంచి తెలుగుదేశం పార్టీ క్రమంగా పుంజుకుంది. ఈ నియోజకవర్గంలో గత మూడు దశాబ్ధాలుగా రాజకీయ పోరాటం పిల్లి సుభాష్చంద్రబోస్, తోట త్రిమూర్తులు మధ్యే సాగుతోంది.
తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏ పార్టీలో ఉన్నారనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోని రామచంద్రపురం ఓటర్లు, ఇద్దరిలో ఎవరికి ఓటేయాలన్న అంశాన్ని మాత్రమే ఎన్నికల్లో ఆలోచిస్తుంటారు. అందువల్ల వీరిద్దరు మినహా మరో ప్రత్యామ్నాయం ఇప్పటి వరకు రామచంద్రపురం ఓటర్లకు లేకుండా పోయింది. ఈ సారి ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పోటీకి దిగటంతో పరిస్థితి మారిపోయంది.
తాళ్లరేవు నుండి దాదాపు 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన చిక్కాల సాదాసీదా జీవితం గడుపుతారు. పైగా మంచి పేరుంది. రామచంద్రపురం ఉపఎన్నికలో ఎవర్ని పోటీకి దింపినా, కనీస ఓట్లు కూడా దక్కవని భావించి చిక్కాలను తెలుగుదేశం పార్టీ పోటీకి దింపింది. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులపై వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు తెలుగుదేశం పార్టీవైపు చూసేందుకు కాస్తంత అవకాశం చిక్కింది. దాంతో ఎవరి ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చిక్కాల రామచంద్రరావు చీల్చుకుపోతారో అంతుబట్టకుండా ఉంది.
తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చిక్కాల ఎన్ని ఓట్లు సాధిస్తే, అంత ప్రభావం కాంగ్రెస్ లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడుతుంది. అన్ని వర్గాల నుండి కొంత శాతం ఓట్లను చీల్చుకునేలా కనిపిస్తున్నారు.