జగన్ వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యే నాని: సిబిఐ ప్రశ్నల వర్షం
సిబిఐ కార్యాలయానికి వచ్చిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నాని కూడా ఉన్నారు. ఆయన ఉదయమే జగన్తో ప్రత్యేకంగా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. జగన్తో పాటు ఆళ్ల నాని వెళ్లడాన్ని కాంగ్రెసు పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయనపై వేటు వేసే యోచనలో పార్టీ ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే జగన్ ఇంటికి వెళ్లిన మైసూరా రెడ్డిపై తక్షణమే తెలుగుదేశం పార్టీ వేటు వేసింది.
జగన్ ఇంటికి మైసూరా రెడ్డి వెళ్లారని తెలియగానే టిడిపి ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. కాంగ్రెసు కూడా ఆళ్ల నానిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ వెంట ఉండటాన్ని కాంగ్రెసు పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. వీరిని ఉపేక్షిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తోంది. అందుకే నానిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోందని అంటున్నారు.
కాగా వరంగల్ జిల్లా నేత కొండా మురళిని పోలీసులు జనగామ వద్ద అదుపులోకి తీసుకున్నారు. జగన్ విచారణ నేపథ్యంలో మురళి పరకాల నుండి హైదరాబాదు బయలుదేరారు. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జగన్ వెంట సిబిఐ కార్యాలయానికి సబ్బం హరి తదితరులు వచ్చారు. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, మోపిదేవి వెంకటరమణ సమక్షంలో సిబిఐ అధికారులు జగన్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా సమాచారం.