వలసలకు చెక్: నానికి షోకాజ్, సబ్బం హరిపై ఫిర్యాదు

దీనిపై కాంగ్రెసు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ను విచారణకు పిలిచే ఇలాంటి సమయంలో పార్టీకి చెందిన నేతలు అతనిని కలవడం కాంగ్రెసు పార్టీ పెద్దలకు మింగుడు పడలేదు. దీనిని ఉపేక్షిస్తే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మరిన్ని చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. గతంలో జగన్ వైపు వెళుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు జగన్ వైపు వెళ్లారని నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు కూడా ఇంత బాహాటంగా జగన్కు మద్దతు ఇస్తుంటే చర్యలు తీసుకోకుంటే ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు జగన్ వైపు భారీగా వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిందేనని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే జగన్తో సిబిఐ కార్యాలయానికి వెళ్లిన సబ్బం హరి, ఆళ్ల నానిలపై చర్యలకు పిసిసి రంగం సిద్ధం చేస్తోంది.
కాగా సబ్బం హరి మొదటి నుండి జగన్ వర్గం నేతగా ఉంటూ వస్తున్నారు. గతంలో మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఆ తర్వాత ఎందుకో వెనక్కి వెళ్లారు. కానీ ఆయన జగన్ వెంటే ఉంటూ వస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు పార్టీకి సరైన కారణం దొరకనందునే ఇన్ని రోజులు మిన్నకుండినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జగన్కు బాహాటంగా మద్దతు ఇవ్వడంతో చర్యలకు ఉపక్రమించి, పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తొలత జగన్ వర్గం నేతగా ముద్ర పడ్డారు. జగన్ తన ఓదార్పు యాత్ర ప్రారంభించింది ఏలూరు నుండే. అప్పటి నుండి ఇటీవల టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే వరకు నాని జగన్ వర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానంలో నాని జగన్కు అనుకూలంగా ఓటు వేస్తారని భావించారు. కానీ అనూహ్యంగా ఆయన ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే శుక్రవారం హఠాత్తుగా జగన్తో కలిసి వెళ్లడం కాంగ్రెసు వర్గాలని ఆశ్చర్యానికి గురి చేశాయి.












Click it and Unblock the Notifications