నాది తప్పయితే, సబితా ఇంద్రారెడ్డిదీ తప్పే: రాజగోపాల్
రాజగోపాల్ తరఫున డిఫెన్స్ న్యాయవాది రవీందర్ రెడ్డి వాదిస్తూ - 201 మందిని సాక్షులుగా పేర్కొన్న ఈ కేసులో అందరినీ విచారణ చేయాలంటే చాలా సమయం పడుతుందని, అప్పటిదాకా సాక్ష్యాల తారుమారుపేరిట బెయిల్కు అభ్యంతరం చెప్పడం సరికాదని అన్నారు. అయితే గాలితో రాజగోపాల్కు చాలా సాన్నిహిత్యం ఉందని, ఆయనకు బెయిల్ ఇవ్వడం తగదని సీబీఐ తరఫు న్యాయవాది బళ్లా రవీంద్రనాథ్ అన్నారు. పిటిషన్పై వాదనలు పూర్తయినట్లు ప్రకటించిన న్యాయమూర్తి పుల్లయ్య తీర్పును ఈనెల 29కి వాయిదా వేశారు.
ఎమ్మార్ కేసులో నిందితుడు సునీల్రెడ్డికి బెయిల్ లభించలేదు. ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను నాంపల్లి సీబీఐ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఎమ్మార్లో తనది నామమాత్ర పాత్ర అని, ఆ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని ఆయన వినిపించిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఎమ్మార్లో చదరపు గజం ఐదు వేలకు విక్రయించినట్లు చూపి అధిక మొత్తాన్ని అక్రమంగా వసూలు చేయడంలో సునీల్రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆ సొత్తు ఎక్కడికి చేరిందో తెలుసుకోవాల్సి ఉందని, ఈ దశలో ఆయనకు బెయిల్ ఇవ్వద్దని సిబిఐ చేసిన వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.
సునీల్రెడ్డి కంపెనీల్లోకి రూ.47 కోట్లకుపైగా వచ్చిన నిధులపై దర్యాప్తు కొనసాగుతోందని సిబిఐ గతంలో వాదనలు వినిపించింది. కాగా, జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో రిమాండ్లో ఉన్న నిందితుల విచారణకు ఈడీ ఇచ్చిన నోటీసులను నిమ్మగడ్డ ప్రసాద్, కోనేరు ప్రసాద్ తీసుకోలేదు. దీంతో శుక్రవారం దీన్ని ఈడి కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
జైలు అధికారుల ద్వారా కోనేరు, నిమ్మగడ్డకు నోటీసులు అందజేయాల్సిందిగా కోర్టు ఈ సందర్భంగా ఈడీకి సూచించింది. ఎమ్మార్ కేసులో బీపీ ఆచార్య, జగతి కేసులో బ్రహ్మానందరెడ్డి అయిష్టంగానే నోటీసులు తీసుకున్నా, కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కోర్టుకు ఈడీ చెప్పింది. దీనిపై స్పందించిన కోర్టు నిందితులకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే 30న కోర్టుకు చెప్పుకోవచ్చని తెలిపింది. కేసు విచారణను 30కి వాయిదా వేసింది.