మా అమ్మను ముషార్రఫ్ చంపాడు: బిలావల్ భుట్టో
ఆక్స్ఫోర్డ్లో చదువు పూర్తి చేసుకుని నిరుడు పాకిస్థాన్ తిరిగి వచ్చిన 23 ఏళ్ళ బిలావల్ తన తల్లి హత్య ఇస్లాం తీవ్రవాదులు, ముషారాఫ్ పాలనల కారణంగా జరిగిందని చెప్పారు. ఆమెను హత్య చేయమని అల్ ఖైదా ఆదేశాలు జారీ చేసిందని, దాడి మాత్రం తాలిబన్లు చేశారని, తన తల్లిపై దాడి జరుగుతుందని కావాలనే ముషార్రఫ్ భద్రత తగ్గించారని ఆయన ఆరోపించారు. ముషార్రఫ్ తన తల్లిని హత్య చేశాడని, తన తల్లికి అతడినే బాధ్యుడిని చేస్తానని స్పష్టం చేశారు. తన తల్లి ఇచ్చే సహాయ సహకారాలపైనే ఆమె భద్రత ఆధారపడి ఉంటుందని కూడా అతడు బెనజీర్ను బెదిరించాడని చెప్పారు.
ముషార్రఫ్ ఎమర్జెన్సీ విధించినప్పుడే పాకిస్థాన్ ప్రజాస్వామ్యానికి తిరిగి రావడం ఇష్టం లేదనే విషయం స్పష్టమైందని, తన తల్లి అతడికి వ్యతిరేకంగా మాట్లాడిన కొద్దీ భద్రత తగ్గుతూ వచ్చిందని ఆనయ అన్నారు. రావల్పిండిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొని తిరిగి వెడుతున్న భుట్టోను 2007, డిసెంబర్ 27వ తేదీన హత్య చేశారు. కాగా, స్వయంగా విధించుకున్న ప్రవాసంలో 2008 నుంచి లండన్లో, దుబాయ్లో ఉంటున్న ముషారాఫ్ స్వదేశానికి తిరిగి వచ్చే యోచనను నిరవధికంగా వాయిదా వేసుకున్నారు. తిరిగి రాగానే అరెస్టు తప్పదని ప్రభుత్వం హెచ్చరించడంతో ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకున్నారు.
కాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధిపతిగా ఉన్న బిలావల్ తాను గత ఎన్నికలలో ప్రచారం చేయలేదని, అప్పుడు తాను చురుకైన పాత్ర పోషించడం సరికాదన్న భావనతోనే యూనివర్సిటీకి తిరిగి వెళ్ళానని చెప్పారు. అయితే రానున్న ఎన్నికలలో ప్రచారం చేసి, పెద్ద పాత్ర పోషించాలని భావిస్తున్నానని చెప్పారు. ఏదో ఒకరోజున పాకిస్థాన్ నాయకుడు కావానుకుంటున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పాకిస్థాన్కిది గడ్డు సమయమని అందరూ సాయపడాలని వ్యాఖ్యానించారు.