జగన్ను కలిసిన మరో ఎమ్మెల్యే, మూడోరోజు విచారణకు
అతను జగన్తో పాటు ఆయన కాన్వాయ్లో సిబిఐ కార్యాలయానికి వచ్చారు. విచారణ రెండో రోజైన శనివారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు కలిశారు. మూడో రోజైన ఆదివారం బాలనాగి రెడ్డి కలిశారు. వీరిలో ఆళ్ల నాని, బాలనాగి రెడ్డి తొలి నుండి జగన్ వర్గీయులుగా ముద్రపడ్డారు. అయితే ఆ తర్వాత గత కొంతకాలంగా వారు జగన్కు దూరంగా ఉంటున్నారు.
అకస్మాత్తుగా సిబిఐ విచారణ, అరెస్టుల ప్రచారం నేపథ్యంలో వారు జగన్ను కలవడం గమనార్హం. అదే సమయంలో కాంగ్రెసు ఎమ్మెల్యే సుజయ్ రంగ కృష్ణారావు కలవడం కాంగ్రెసు వర్గాల్లో కలకలం రేపింది. మిగిలిన ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ రోజు జగన్ను కలిసిన వారిలో బాలనాగి రెడ్డితో పాటు ఆళ్ల నాని, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తదితరులు ఉన్నారు. కాగా జగన్ సిబిఐ విచారణ కోసం తన ఇంటి నుండి ఉదయం పది గంటల పది నిమిషాలకు దిల్ కుషా అతిథి గృహానికి బయలు దేరారు.
పదిహేను నిమిషాలలో జగన్ సిబిఐ కార్యాలయం చేరుకున్నారు. జగన్తో పాటు సబ్బం హరి, ఆళ్ల నాని, సుజయ్ కృష్ణ రంగా రావు, జూపూడి ప్రభాకర రావు వచ్చారు. మరోవైపు గత రెండు రోజుల కంటే ఈ రోజు దిల్ కుషా అతిథి గృహం వద్ద భద్రతను పెంచారు. హైదరాబాదులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. జగన్ ఇళ్లు లోటస్ పాండ్ నుండి సిబిఐ కార్యాలయం వరకు గట్టి బందోబస్తును ఉంచారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.
రాజ్ భవన్ దగ్గర బ్యారీకేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. మక్తా రోడ్డు వైపు సామాన్యులను ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు. హైదరాబాదులో హై అలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. నాంపల్లి సిబిఐ కోర్టు పరిధిలోని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాదులోని పలు రోడ్లు పోలీసుల అదుపులో ఉన్నాయి. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను కూడా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ రోజుతో వీరి కస్టడీ ముగుస్తుంది.