అవకాశం లేకపోయేది: విజయమ్మకు సిఎం, నో యాడ్స్
సిబిఐ విచారణతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతోందన్నారు. రాజకీయ లబ్ధి కోసం వైయస్ విజయమ్మ, ఆ పార్టీ నేతలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను, కాంగ్రెసును, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శిస్తున్నారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ తనపై వస్తున్న ఆర్థిక నేరాలకు కోర్టులో సమాధానం చెప్పుకోవాలని సూచించారు. కానీ ఈ అంశాన్ని ఓట్ల కోసం రాజకీయ లబ్ధికి వాడుకోవడం సరికాదన్నారు.
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరితే కూడా తప్పుపట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే మీరు కోర్టుకు వెళ్లి జగన్ అవినీతి చేయలేదని నిరూపించుకోవచ్చునని సూచించారు. ప్రజాస్వామ్యం లేకుంటే మీకు బురద జల్లే అవకాశం కూడా లేకపోయేదన్నారు. ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే మీరు విమర్శలు చేస్తున్నారన్నారు. నిర్దోషులుగా నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉందన్నారు.
స్వర్గీయ మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసు ఎఫ్ఐఆర్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి స్వయంగా జగన్ పేరును చేర్చారని, అప్పుడు వారి కుటుంబం సిబిఐ విచారణను స్వాగతించిందని గుర్తు చేశారు. అప్పుడు స్వాగతించిన అదే కుటుంబం ఇప్పుడు అదే సిబిఐ విచారణను తప్పుపట్టడమేమిటన్నారు. పరిటాల హత్య కేసులో జగన్ నిందితుడు అన్న ఆరోపణలు ఉన్నాయని, దాని పైన అప్పుడు విచారణ జరిగిందన్నారు.
జగన్ అరెస్టులో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదన్నారు. అంతా ప్రజలు, దేవుడు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెసు వల్లనే వైయస్ రాజశేఖర రెడ్డి ఆ స్థాయికి ఎదిగారని వైయస్ కుటుంబం గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెసు కారణంగానే రెండుసార్లు సిఎల్పీ లీడర్గా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయ్యారన్నారు. వైయస్కు కష్టపడి పని చేసే తత్వం ఉందని, దానిని అధిష్టానం గుర్తించిందన్నారు. అవకాశం ఇస్తేనే ఆయన ఎదిగారని చెప్పారు.
రాజకీయ లబ్ధి కోసం వైయస్ హెలికాప్టర్ ప్రమాదాన్ని వివాదాస్పదం చేస్తున్నారన్నారు. వైయస్ మృతిపై అనుమానాలు ఉంటే మళ్లీ దర్యాఫ్తు చేయాలని అడుగుతామన్నారు. సుప్రీం కోర్టు నోటీసులకు మంత్రులు వివరణ ఇస్తారన్నారు. అవసరమైతే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుందన్నారు. మోపిదేవి నిర్దోషిగా బయటకు వస్తారని కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు గెలవాలనుకుంటే వేరే విధంగా ముందుకు వెళ్లాలని, కానీ బురద జల్లడం మానుకోవాలని సూచించారు.
మంత్రులెవరి పైనా ఒత్తిడి లేదన్నారు. విజయమ్మ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదన్నారు. శాంతిభద్రతల కోసమే ముందస్తు అరెస్టులు అన్నారు. వాస్తవాలు బయటకు రాకముందే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దర్యాఫ్తుపై ప్రభావం పడుతుందన్నారు. అక్రమ పెట్టుబడుల ఆరోపణలతోనే జగన్ మీడియాకు ప్రకటనలను నిలిపివేసినట్లు చెప్పారు.
కాగా కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడా వైయస్ విజయమ్మ పేరు ప్రస్తావించలేదు. దీంతో ఓ విలేకరి దీనిని ప్రశ్నించారు. అందుకు కిరణ్ మీడియాపై సెటైర్ వేశారు. మీరింత అమాయకులని అనుకోలేదని, మీకు అన్నీ తెలిసి ఉంటాయని అనుకున్నానని, చెప్పేందుకు వెనుకాడలేదని అంటూ వైయస్ విజయమ్మ ఆరోపణలపై తాను స్పందించినట్లు చెప్పారు.