ఖబర్దార్: ఐరన్ లెగ్గంటూ రోజాపై శివాలెత్తిన గంగాభవాని
ఆమె వల్లనే జగన్ జైలుకు వెళ్లారన్నారు. జగన్ అరెస్టుతో ఆమె ఐరన్ లెగ్ అని మరోసారి తేలిపోయిందన్నారు. రోజా, మైసూరా రెడ్డిలు ఎక్కడ ఉంటే అక్కడ పార్టీలు ఖతమవుతాయన్నారు. వారిద్దరు జగన్ పార్టీలోకి వెళ్లడం వల్ల కాంగ్రెసు పార్టీ గెలుపు నల్లేరు మీద నడక అయిందన్నారు. వారిద్దరు ఉన్న పార్టీలు ముందుకు సాగవన్నారు. వారు జగన్ పార్టీలో ఉన్నంత కాలం మా గెలుపుకు ఎలాంటి ఢోకా లేదన్నారు.
రోజా తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, అలా అయితే ఊరుకునేది లేదన్నారు. సినిమా నటివి కాబట్టి ఒక్కో సినిమాలో ఒక్కో క్యారెక్టర్ వేసినట్లు నిత్యం పార్టీలు మారుతున్నారని విమర్శించారు. రోజాలో రాజకీయ లక్షణాలు లేవని, ఓ వైపు రాజకీయాలు అంటూనే మరోవైపు రింగ రింగ అంటూ ఎగురుతుందని మండిపడ్డారు. రాజకీయ నటిగా కొత్త పాత్ర వేస్తోందన్నారు. ఏ మొహం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా పార్టీలు మారుతున్నావని ప్రశ్నించారు.
ఖబర్దార్ రోజా నోటిని అదుపులో పెట్టుకోమని గంగా భవాని హెచ్చరించారు. లేదంటే కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర పార్టీ నేతలు ఎవరినైనా విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. అవాకులు చవాకులు వద్దన్నారు.