తెలంగాణపై విజయమ్మ వైఖరి చెప్పాల్సిందే: కెటిఆర్
వైయస్ జగన్ కోసమే కొండా సురేఖ రాజీనామా చేశారని ఆయన అన్నారు. జగన్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రాజీనామా చేసి తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు రాజీనామ చేశానని సురేఖ అంటే నమ్మేవారు ఎవరూ లేరని ఆయన అన్నారు. జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవాలని, వైయస్ రాజశేఖర రెడ్డి హయంలో విడుదల చేసిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సిబిఐ నిష్ఫక్షపాతంగా దర్యాప్తు చేస్తుందని నిరూపించుకోవాలంటే వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో సలహాదారుగా పనిచేసిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కూడా విచారించాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్ను ఎప్పుడో అరెస్టు చేయాల్సిందని ఆయన అన్నారు. వైయస్ జగన్ అవినీతిలో మంత్రులకు కూడా పాత్ర ఉందని ఆయన అన్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో మంత్రులను విచారించి, వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అవినీతిలో కాంగ్రెసు పార్టీకి వాటా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలను పరకాల ప్రజలు తిరస్కరిస్తారని ఆయన చెప్పారు. తాను తెలంగాణవాదిని కానని, సమైక్యవాదినని కొండా సురేఖ ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో చెప్పిన మాటల సిడిని కెటి రామారావు విడుదల చేశారు.