10 వరకైనా బెయిలివ్వండి: జగన్ లాయర్, వద్దని సిబిఐ
విచారణ సమయంలో సిబిఐ, జగన్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. జగన్ అరెస్టు అక్రమమని, సిబిఐ విచారణ తొమ్మిది నెలలుగా జరుగుతోందని, కానీ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో తమ క్లయింటును అరెస్టు చేశారని జగన్ తరఫు న్యాయవాది చెప్పారు. ఇన్నాళ్లుగా విచారించకుండా.. కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత విచారణ పేరిట పిలిపించి అరెస్టు చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 150 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయని, అందులో 72 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని, వారిపై 412 కేసులు ఉన్నాయని అయినప్పటికీ వారు బయట ఉన్నారని చెప్పారు.
జగన్ ఓ పార్టీ అధ్యక్షుడని, ఉప ఎన్నికలలో ఆయన ప్రచారం చేయాల్సి ఉందని అందుకోసం ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు 10వ తేది వరకు బెయిల్ ఇవ్వండని, ఆ తర్వాత 11వ తేదిన కోర్టుకు వచ్చి సరెండర్ అవుతారని చెప్పారు. అవసరమైతే బెయిల్ ఇచ్చాక.. ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ రాత్రివేళల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలీసు స్టేషన్లలో అటెండ్ అవుతారని చెప్పారు. ఛార్జీషీట్ దాఖలు చేశాక బెదిరించడమనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు.
జగన్ను అరెస్టు చేసేందుకు సిబిఐకి సరైన సాక్ష్యాధారాలు లేవన్నారు. ఇన్నాళ్లూ సాక్ష్యులను ప్రభావితం చేయని జగన్ ఇప్పుడే ఎలా చేస్తారన్నారు. బెయిల్ మంజూరు చేశాక ఎలాంటి షరతులు విధించినా తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. జగన్ తమ విచారణకు ఏమాత్రం సహకరించలేదని సిబిఐ తరఫు న్యాయవాది చెప్పారు. విచారణలో ఆయన మౌనమే సమాధానంగా ఉందన్నారు. కేసు ప్రస్తుతం కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని, సాక్ష్యులను బెదిరించే అవకాశముందని చెప్పారు.
మూడు రోజుల తమ విచారణలో సమాధానం చెప్పలేదని అందుకే అరెస్టు చేసినట్లు చెప్పారు. సిబిఐపై కాంగ్రెసు ప్రభావం లేదన్నారు. ఉప ఎన్నికలలో అతను అభ్యర్థి కాదు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా విదేశాల నుండి పెట్టుబడులు తన కంపెనీలలో జగన్ పెట్టుబడులు పెట్టించారన్నారు. తన కంపెనీలలో పెట్టుబడులు పెట్టించడం కోసం జగన్ అనేక కుట్రలకు పాల్పడ్డారన్నారు.
మరోవైపు జగన్ ఆస్తుల కేసులో ఈడి రంగంలోకి దిగింది. జగన్ కంపెనీలలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులపై సిబిఐ దగ్గర నుండి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. సిబిఐ నుండి పలు డాక్యుమెంట్లను సేకరించినట్లుగా సమాచారం. 2ఐ క్యాపిటల్, ప్లూరీ ఎమర్జెన్సీలపై కూపీలాగుతోందని సమాచారం. జగన్ కంపెనీలలో మారిషస్ సంస్థ రూ.124 కోట్లు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు.
విజయసాయి రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని సిబిఐ వేసిన పిటిషన్పై నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది. అలాగే, జగన్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది.