జగన్ గూటికి మరో ఎమ్మెల్యే, అజ్ఞాతంలోకి జయమణి
ఆమెను కలిసేందుకు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కాకినాడ నుండి తన కుటుంబంతో సహా బయలుదేరి వెళ్లారు. ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమెకు సంఘీభావం తెలిపారు. ఎస్.రాయవరం మండలే దార్లపూడి పర్యటనలో ఉన్న విజయమ్మను ఆయన కలిశారు. ఆయన ఎప్పుడైన జగన్ పార్టీలో చేరే అవకాశముందని అంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మొదట జగన్ వర్గం నేతగానే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చలువ కారణంగా 2009లో ద్వారంపూడికి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఇచ్చింది.
ఈ కారణంగా జగన్ కాంగ్రెసు పార్టీని వీడాక ఆయన వర్గం కాంగ్రెసు నేతగా ద్వారంపూడి ముద్రపడ్డారు. జగన్ సభలకు, దీక్షలకు వెళ్లారు. ఆయనకు మద్దతు ప్రకటించారు. అయితే కొంతకాలం తర్వాత ఆయన జగన్కు క్రమంగా దూరమై, కాంగ్రెసు పార్టీలోనే కొనసాగారు. తాను కాంగ్రెసు పార్టీలోనే ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు. జగన్కు ఎవరు దూరమైనా ద్వారంపూడి మాత్రం అతనితోనే ఉంటారని అప్పట్లో అందరూ భావించారు.
అయితే ఆయన కాంగ్రెసులో ఉంటానని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మళ్లీ ఆయన జగన్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. ఇప్పటికే బొబ్బిలి శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగారావు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ద్వారంపూడి కూడా జగన్ పార్టీలోకి జంప్ అయ్యే ఉద్దేశ్యంతోనే వైయస్ విజయమ్మ ప్రచారానికి సంఘీభావం ప్రకటించారని అంటున్నారు.
మరోవైపు పార్వతీపురం శాసనసభ్యురాలు జయమణి అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె తన గన్మెన్లను వదిలి పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైయస్ విజయమ్మను కలిసేందుకు వెళ్లారనే వదంతులు వినిపిస్తున్నాయి. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నందుకే తాను కాంగ్రెసును వీడి జగన్తో కలిశానని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని చెప్పారు.
తాను ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. శుక్రవారం నుండి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. జగన్ చాలా ధైర్యంగా ఉన్నారని, ప్రజలను కూడా ధైర్యంగా ఉండమని చెప్పారన్నారు. నాని జైలులో జగన్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.