ఒంగోలు: బాలినేని వర్సెస్ పార్వతమ్మ, టిడిపి కూడా..
తమ పార్టీ అధ్యక్షుడున వైయస్ జగన్ను సిబిఐ అక్రమంగా అరెస్టు చేసిందని ఆ సానుభూతి ఎక్కువగా ఉంటుందని, అందువల్ల తన గెలుపు నల్లేరుమీద నడకేనన్న ధీమాలో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఎవరికి వారే గెలుపు ధీమాలో ఉన్నప్పటికీ ప్రచారాన్ని మాత్రం ఉద్ధృతం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రచారం ఒక ఎత్తు అయితే వచ్చేనెల ఒకటో తేదీ నుండి ప్రారంభమయ్యే ప్రచారం మరో ఎత్తు అని అంటున్నారు. జూన్ ఒకటవ తేదీ నుండి ముమ్మరంగా ప్రచారం నిర్వహించేందుకు అగ్రనేతలను ప్రచార రంగంలోకి దించుతున్నారు.
ఒంగోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ వచ్చేనెల మొదటి వారంలో వైయస్ విజయమ్మ ఒంగోలుకు రానున్నట్లు తెలుస్తోంది. విజయమ్మ నియోజకవర్గంలో ఒక్కసారి పర్యటిస్తే రాజకీయ పరిణామాలన్ని మారతాయన్న ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు తెలిసింది. ఈపాటికే వైయస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జరిపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోశారు. వచ్చేనెల ఒకటవ తేదీన రాష్ట్ర పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు పర్యటించనున్నారు. బాలకృష్ణ కోసం తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుంట పార్వతమ్మ విజయం కోసం ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, జిల్లామంత్రులు, శాసనసభ్యులు తదితరులు ముమ్మరంగా ప్రచారం సాగించారు. మలి విడతగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి రానున్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరీ పర్యటించనున్నారు. మొత్తంమీద వచ్చేనెల మొదటి వారంలో నియోజకవర్గంలో నేతలు విస్తృతంగా పర్యటించనున్నారు.