రాయదుర్గం: దీపక్ రెడ్డికి జెసి దివాకర్ రెడ్డి 'కాపు'?
ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డికి జెసి దివాకర్ రెడ్డి సహకరించే అవకాశాలు లేవు. ఇది కాంగ్రెసు విజయావకాశాలను మెండుగా దెబ్బ తీసే అవకాశాలున్నాయి. తాను కాంగ్రెసు పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. కానీ, చాలా ముందు చూపుతో దీపక్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలోకి దించుతున్నారని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది.
జెసి దివాకర్ రెడ్డి దీపక్ రెడ్డికి సహకరిస్తే పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్యనే ఉండే అవకాశాలున్నాయి. అయితే, పాటిల్ వేణుగోపాల్ రెడ్డికి తగిన బలం ఉంది. అయితే, వేణుగోపాల్ రెడ్డికి వ్యక్తిగత బలం సరిపోతుందా అనేది అనుమానంగానే ఉంది. కాగా, కాపు రామచంద్రా రెడ్డికి కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు అండదండలున్నాయి. దీంతో కాపు రామచంద్రా రెడ్డి విజయానికి దగ్గరగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అయితే, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలు పాలు కావడం వ్యతిరేకంగా పనిచేస్తుందా, సానుభూతి కురుస్తుందా అనేది చెప్పలేని వాతావరణం.
1952 నుంచి 2009 వరకు రాయదుర్గం నియోజకవర్గానికి 14 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పదిసార్లు గెలుపొందగా తెలుగుదేశం, స్వతంత్ర అభ్యర్థులు రెండేసి మార్లు గెలుపొందారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ తెలుగుదేశం వరుస పరాజయాలను చవిచూసింది. 1983లో జరిగిన తొలివిడత ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థే గెలుపొందడం గమనా ర్హం. ఆ తరువాత 1985,1989 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పరాభవం తప్పలే దు. 1994లో తెలుగుదేశం పార్టీ మొదటిసారి విజయం సాధించింది.
1985 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతరపున పోటీ చేసి గెలుపొందిన మునికుంటప్ప 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పక్షాన పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్రెడ్డిపై విజయం సాధించారు. 1999లో తెలుగుదేశం అభ్యర్థి జితేంద్రప్పపై కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్రెడ్డి గెలుపొంది తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు.
2004 ఎన్నికల్లో పాటిల్కు మళ్లీ చుక్కెదురైంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గె లుపొందారు. 2009 ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీతరపున కొత్త వ్యక్తిని రంగంలోకి దింపారు. పాటిల్ను పక్కనపెట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన రెడ్డి వర్గీయుడు కాపు రామచంద్రారెడ్డిని బరిలో నిలిపింది. సమీప తెలుగుదేశం అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై కాపు విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి కోసం మంత్రి రఘువీరారెడ్డితోపాటు ఆ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. తెలుగుదేశం అభ్యర్తి కోసం ఆ పార్టీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, బీకే పార్థసారధి తదితరులు ప్రచారం చేస్తున్నారు.