ఐఎఎస్ ఎల్వీకి కోర్టు సమన్లు, 18 హాజరుకు ఆదేశం
ఎమ్మార్ కేసులో నిందితులు, ఐఎఐస్ అధికారులు బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యంలపై ఐపిసి సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణకు కోర్టు అనుమతించింది. ఈ మేరకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఐఏఎస్ అధికారులపై అవినీతి నిరోధక (పీసీ) చట్టం కింద కేసులు నమోదైతే వాటి విచారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నిబంధన వారికి రక్షణ ఛత్రంగా నిలుస్తోంది. సిబిఐ విచారణకూ ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నిబంధన కారణంగానే బిపి ఆచార్య, ఎల్వీలపై విచారణ పెండింగ్లో పడింది. దీంతో, కేంద్రంలో ఏం జరుగుతోందో తెలియడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశించిన స్థాయిలో సహకరించడం లేదంటూ సిబిఐ అధికారులు కోర్టుకే తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కనీసం ఐపిసి సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణకు అయినా అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేసింది.
వాటిని పరిశీలించిన కోర్టు ఐపిసి సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణకు నిబంధనలు ఏమీ అడ్డుగా లేవని భావించి వాటిపై విచారణ ప్రక్రియ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం నాంపల్లి సీబీఐ ప్రిన్సిపల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతోఎమ్మార్ కేసులో తొలి నిందితుడు బిపి ఆచార్యపై ఐపీసీ 120-బీ (నేరపూరిత కుట్ర), 409 (అధికార దుర్వినియోగం) కింద విచారణ మొదలు కానుంది. ఎల్వీ సుబ్రమణ్యంపై 120-బీ కింద మాత్రమే సిబిఐ అభియోగాలు మోపింది.