ప్రత్తిపాడు: మహిళలు సుచరితను గట్టెక్కిస్తారా?
తెలుగుదేశం పార్టీ తరఫున కందుకూరు వీరయ్య, కాంగ్రెసు తరఫున టిజెఆర్ సుధాకర్ బాబు పోటీ చేస్తున్నారు. వీరిద్దరు కూడా సుచరితకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కూడా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 12 వేల 880 మంది ఓటర్లున్నారు. వీరిలో లక్షా 8 వేల 991 మంది మహిళలు. పురుష ఓటర్లు లక్షా 3 వేల 889 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు సుచరితకే మద్దతు ఇస్తారని, వైయస్ విజయమ్మ, షర్మిల ప్రచారం సుచరితకు అనుకూలిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు.
దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్తిపాడు ప్రాతినిధ్యం వచ్చిన తొలి మహిళా శానససభ్యురాలు సుచరితనే. కామర్స్లో పిజి చేసిన సుచరిత అంతకు ముందు జడ్పిటిసి సభ్యురాలిగా పనిచేశారు. 2009లో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సుచరిత కేవలం 2 వేల ఓట్లతో ఓడించారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో 50 వేల మంది ఎస్సీ ఓటర్లున్నారు. అయితే వీరిలో మాలలు 36 వేల మంది కాగా, మాదిగలు 14 వేల మంది. సుచరిత, సుధాకర్ బాబు మాల అభ్యర్థులు కాగా, వీరయ్య మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు.
కాగా, గుంటూరు రూరల్ మండలం జయాపజయాలు నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ మండలంలో 77 వేల మంది ఓటర్లుండగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 35 వేల మంది ఉన్నారు. కాంగ్రెసుకు ఇక్కడ బలం ఉంది. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ఇక్కడ విస్తృతంగా పర్యటించి, ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి కన్నా లక్ష్మినారాయణ వారు కాంగ్రెసు చేయి దాటిపోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.