మోపిదేవే బాధ్యుడు: సిబిఐ, కోనేరుకు నో బెయిల్
వాన్పిక్ కు ప్రయోజనాలు కల్గించడమే లక్ష్యంగా మోపిదేవి పనిచేశారని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. మోపిదేవి మంత్రిగా బాధ్యతలు సరిగా నిర్వహించలేదని చెప్పారు. మోపిదేవికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సిబిఐ తెలిపింది. వాన్పిక్ రూ.16 వేల కోట్ల ప్రాజెక్ట్ అని, ఈ వ్యవహారంలో ఇతర మంత్రులకు సంబంధం లేదని తెలిపింది. తమ భూములను బలవంతంగా సేకరించారని అనేక మంది రైతులు తమకు ఫిర్యాదు చేశారని కోర్టులో సిబిఐ వాదించింది.
కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన కోనేరు ప్రసాద్కు కోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన మరిన్ని రోజులు చంచల్గుడా జైల్లోనే ఉండాల్సి వస్తోంది. బయటకు వస్తే కోనేరు ప్రసాద్ సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐ వాదించింది. కోనేరు ప్రసాద్ బెయిల్కు దరఖాస్తు చేసుకోవడం ఇది ఐదో సారి.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్డన్ రెడ్డి ఒఎంసి అక్రమ మైనింగ్ కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ను హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. దీనిపై విచారణను హైకోర్టు రెండు వారాలు పాటు వాయిదా వేసింది. ఒఎంసి కేసులో నిందితురాలిగా ఆమె ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉన్నారు.
ఇదిలా వుంటే, అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి) అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీని బెంగుళూర్ సిబిఐ కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఐదుగురికి కస్టడీ పొడగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.