చివరి రోజు విచారణకు జగన్: పొన్నాల కూడా, కలిసి...
విచారణ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడతానని చెప్పారు. కోర్టులను తాము గౌరవిస్తామని చెప్పారు. నవ్వుతూ వెళితే మేకపోతు గాంభీర్యం అంటారని, లేదంటే ఆందోళనగా ఉన్నారని అంటారని పొన్నాల మీడియాతో చలోక్తులు వేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారి ఆదిత్యనాద్ దాస్ కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు.
కాగా చంచల్గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇదే కేసు విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇక చంచల్గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు ఐదో రోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
అతనిని బుల్లెట్ ప్రూఫ్ ప్రత్యేక వాహనంలో జైలు నుండి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి తరలించారు. పొన్నాల లక్ష్మయ్య దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో భారీ నీటి పారుదల శాఖామాత్యులుగా పని చేశారు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్లు ఇచ్చేందుకు జివోలపై సంతకాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జగన్ను, పొన్నాలను కలిసి విచారించే అవకాశముంది.