తెలంగాణ కోసమే... కానీ: షర్మిల ఉద్వేగం, చిరుపై ఫైర్
సిబిఐ పేరు చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, తన సోదరుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ను దెబ్బ తీయాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేస్తున్నాయన్నారు. కొండా సురేఖ తొలుత తెలంగాణ కోసం రాజీనామా చేశారని కానీ ఉద్దేశ్య పూర్వకంగా ఆమోదంచలేదన్నారు. ఆ తర్వాత రైతుల కోసం సురేఖ పదవిని కోల్పోయారన్నారు.
తన తండ్రి వైయస్ నిత్యం ప్రజా సంక్షేమం కోసమే ఆలోచించే వారన్నారు. అలాంటి నేతను ఇప్పుడు కాంగ్రెసు అవినీతిపరుడు అంటున్నారన్నారు. ప్రజల ముందు ఆయనను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. సిబిఐ విచారణ పేరుతో జగన్ను జైలుకు పంపారని, ఆయన ఏం తప్పు చేశాడని కటకటాలకు వెనక్కి పంపారని ప్రశ్నించారు. సాక్ష్యులను బెదిరించే అవకాశముందని అరెస్టు చేసినట్లు సిబిఐ చెబుతోందని, కానీ రెండేళ్లుగా జగన్ బయటే ప్రజల మధ్య తిరుగుతున్నారని, తొమ్మిది నెలలుగా విచారణ జరుపుతున్నారని అప్పుడు తారుమారు చేయని సాక్ష్యాలు ఇప్పుడు చేస్తారా అని ప్రశ్నించారు.
జగన్ బయట ఉన్నప్పుడు ఎవరినైనా బెదిరించారా అంటే వారి వద్ద సాక్ష్యాలు లేవన్నారు. జగన్ బయట ఉంటే ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాలలో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే కుట్రతోనే టిడిపి, కాంగ్రెసు కలిసి జైలుకు పంపించాయన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదం పైన, చిరంజీవి కూతురి ఇంట్లో దొరికిన డబ్బుల పైన విచారణ జరిపించకుండా కేవలం జగన్ పైనే ఎందుకు చేయిస్తున్నారన్నారు. హెలికాప్టర్ ప్రమాదం పైన తమకు అనుమానముందన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే హెలికాప్టర్లో బయలుదేరాల్సి ఉన్నప్పటికీ ఎందుకు వెళ్లలేదో చెప్పాలన్నారు.
జగన్ ఎంపీ కావడం, ఆయన ఐదు లక్షల మెజార్టీతో గెలవడం, ప్రజల్లో మంచి ఆదరణ కలిగి ఉండటమే తన అన్న చేసిన పాపమా అన్నారు. బోనులో పెట్టినా సింహం సింహమే అని, అదే గుండె ధైర్యంతో అదే నిబ్బరంతో జగన్ ఉన్నారన్నారు. తప్పు చేయలేదని, బయటకు వస్తానని, మీకు సేవ చేస్తానని జగన్ గట్టి నమ్మకంతో ఉన్నారన్నారు. తన అమ్మ వైయస్ విజయమ్మకు ఎక్కడా న్యాయం దొరక్క మీ వద్దకు వచ్చారని ప్రజలను ఉద్దేశించి అన్నారు. పిసిసి చీఫ్ బొత్స అధికారదాహంతో మేమే తన తండ్రి వైయస్ను చంపామని ఆరోపిస్తున్నారని, ఇంతకన్నా నీచం మరొకటి ఉందా అన్నారు. సిఎం కిరణ్ జగన్ పద్నాలుగేళ్లు జైల్లో ఉంటారని చెబుతున్నారని.. విచారణ పేరుతో లేదా అబద్దపు సాక్ష్యాలతో జగన్ను అన్నేళ్లు జైల్లో ఉంచాలని కాంగ్రెసు కుట్ర చేస్తోందన్నారు.
వైయస్ కిరణ్ను స్పీకర్ చేయకుంటే సోనియా గాంధీ కంటికి అతను కనిపించే వారా అని ప్రస్నించారు. కాంగ్రెసులో ఉంటే పదవులు బయటకు వెళితే కక్ష సాధింపా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పథకాలు వైయస్వి కాదని కాంగ్రెసువని ఆయన అంటున్నారని, అలా అయితే కాంగ్రెసు పాలిత ప్రాంతాలలో ఆ పథకాలు ఎందుకు లేవన్నారు. రాజ్యసభ స్థానం కోసం చిరు తన ప్రజారాజ్యం పార్టీని మూసివేసి కాంగ్రెసులో కలిపేశారన్నారు. అది స్వార్థం కాదా అని ప్రశ్నించారు. రైతుల కోసం ఆయన ఆయన ఇలా చేశాడా అని ప్రశ్నించారు.
వైయస్సార్ కాంగ్రెసుకు ఓటేస్తే అందరూ జైలుకు వెళ్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. మన గెలుపు ఎలా అడ్డుకోవాలో తెలియక ఆయన ఇలా మాట్లాడుతున్నారన్నారు. బాబుకు దేశ విదేశాలలో వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఈ ఉప ఎన్నికలను దేశమంతా చూస్తుందని, ఈ ఉప ఎన్నికలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, జగన్ భవితవ్యం తేలుతుందని దేశం యావత్తూ ఆసక్తి కనబరుస్తోందన్నారు. మీరంతా ఓటు వేసి గెలిపించి అందరూ జగన్ వైపు ఉన్నారని ఓటు ద్వారా చెప్పాలన్నారు. వైయస్ కుటుంబానికి అండగా ఉన్న వారిలో కొండా సురేఖ మొదటి వారని, అభిమానంతో మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారన్నారు.
ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు. కొండా సురేఖ తెలంగాణ కోసం రాజీనామా చేస్తే రాజకీయ దురుద్దేశ్యంతో ప్రభుత్వం ఆమోదించలేదని, రైతుల పక్షాన నిలబడినందుకు ఆ తర్వాత పదవి కోల్పోయారన్నారు. అన్ని పార్టీలు వచ్చి ఒక్క మహిళను పరకాలలో అడ్డుకోవడానికి చూస్తున్నాయని షర్మిల అన్నారు. కొండా దంపతుల ధైర్యం అంతా వరంగల్ ప్రజలే అన్నారు. రాజన్న రాజ్యం కావాలంటే జగన్ సిఎం కావాలని పిలుపునిచ్చారు. దేవుడు ఉన్నాడని, జగన్ను బయటకు తీసుకు వస్తాడని, ముఖ్యమంత్రి చేస్తాడన్నారు. ఇందుకు మనం చేయాల్సింది ఫ్యాన్ గుర్తుకు ఓటేయడమే అన్నారు.