తాజా చిక్కుల్లో స్వామి నిత్యానంద: కేసు నమోదు
నిత్యానందపై, ఆయన అనుచరులపై బిదాడి పోలీసు స్టేషనులో నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు, గురువారం రాత్రి నిత్యానంద ఆశ్రమంలో తమపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారని రామనగర పోలీసు సూపరింటిండెంట్ అనుపమ్ అగర్వాల్ చెప్పారు. కొంత మంది మాజీ శిష్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిత్యానంద రేప్ అరోపణలతో పాటు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
నిత్యానంద, ఆయన అనుచరులు నలుగురు తనపై దాడి చేసారని, ఓ అమెరికా మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేసిన విషయంపై మీడియా సమావేశంలో నిత్యానందను ప్రశ్నించినందుకు తనపై ఆ దాడికి దిగారని రిపోర్టర్ ఆరోపించారు. నిత్యానందనే ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ రిపోర్టర్ తెలిపారు.
ఇదిలా వుంటే, కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు కొంత మంది శుక్రవారం ఆశ్రమంలోకి దూసుకెళ్లి, నిత్యానంద పట్ల నిరసన వ్యక్తం చేశారు. వారికి, నిత్యానంద అనుచరులకు మధ్య మాటల యుద్ధం సాగింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.