జగన్ చుట్టూనే 'తెలంగాణం': కిషన్రెడ్డి వర్సెస్ కెటిఆర్
పరకాల కూడా బిజెపి ఖాతాలో పడిపోతే తెరాస రాజకీయ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ఎలాగైనా పరకాలలో గట్టెక్కేందుకు తెరాస తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బిజెపి కూడా పరకాలలో కాషాయ జెండా ఎగుర వేసేందుకు జాతీయ నేతలను సైతం రంగంలోకి దింపుతోంది. బెట్టింగ్ రాయుళ్లు కూడా బిజెపి గెలుపు పైనే జోరుగా బెట్టింగులు కాస్తున్నారట. పాలమూరు గెలుపు తర్వాత బిజెపి వైపు ప్రజలు చాలామంది మొగ్గడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇది తెరాసకు ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.
దీంతో తెరాస నేతలు బిజెపిని ఎలాగైనా ఉప ఎన్నికలలో దెబ్బతీసేందుకు వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. విమర్శలు కూడా వ్యూహాత్మకంగా చేస్తున్నారని అంటున్నారు. ఆదివారం తెరాస సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు బిజెపి పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఒప్పందాలు ఉన్నాయని విపక్షాలు పలుమార్లు విమర్శించిన విషయం తెలిసిందే.
అయితే కెటిఆర్ ఆదివారం బిజెపిపై చేసిన విమర్శలు ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా కనిపించాయి. ఓ వైపు బిజెపికి జగన్తో లింక్ అంటగడుతూ.. తమకు ఆయనతో సంబంధం లేదనే తీరును ఆయన వ్యాఖ్యలు బలపరుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బిజెపి ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. తెరాస స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగితనే తెలంగాణ వస్తుందన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డమ్మీ అని, ఆయన వెనుక వెంకయ్య నాయుడు, గాలి జనార్ధన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. సుష్మా స్వరాజ్ జగన్ అవినీతి పైన నోరెత్తక పోవడమే ఇందుకు మంచి కారణమన్నారు. జగన్ అనుంగు సోదరుడు గాలి అని మండిపడ్డారు. జగన్ గురించి, ఆయన అవినీతి గురించి బిజెపి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కొండా సురేఖను పరకాలలో గెలిపించేందుకే బిజెపి పోటీ చేస్తోందన్నారు.
తెలంగాణవాదుల ఓట్లు చీల్చాలని బిజెపి చూస్తోందన్నారు. పరకాలలో బిజెపి పంచుతున్న ప్రతి పైసా జగన్, గాలి డబ్బే అన్నారు. బిజెపికి ఓటేస్తే జగన్కు ఓటేసినట్లేనని వ్యాఖ్యానించారు. జగన్ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. కొండా దంపతులు రౌడీయుజం గురించి కూడా మాట్లాడలేదన్నారు. కొండా దంపతులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు పత్తి విత్తనాలు బంగారం పంచాలని చూస్తున్నారని ఆరోపించారు.
తెరాస చీఫ్ కెసిఆర్ సభకు వచ్చిన ప్రజలను చూస్తేనే పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని తేలిపోయిందని హరీష్ రావు వరంగల్లో అన్నారు. ఇక మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందన్నారు. వానదేవుడు, గాలిదేవుడు కూడా తెరాస వైపే ఉన్నారన్నారు. సుష్మా స్వరాజ్ సురేఖ గూండాయిజం, జగన్ అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. భారీ మెజార్టీతో భిక్షపతి గెలవడం ఖాయమన్నారు. పరకాలలో పర్యటించిన అగ్ర నేతలు ఆంధ్రలో ఎందుకు పర్యటించలేదన్నారు. తెరాసను టార్గెట్ చేసుకొని కిషన్ రెడ్డి వైయస్ రుణం తీర్చుకుంటున్నారన్నారు.
కాగా తెరాస నేతల విమర్శలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అంతే ఘాటుగా తిప్పి కొట్టారు. ఆశపడటం తప్పు కాదని కానీ అవకాశవాదం తప్పని కిషన్ రెడ్డి తెరాసను ఉద్దేశించి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు రాష్ట్రానికి ఓ చీడపురుగులా మిగిలిపోతుందన్నారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత జెఏసిలో ఉండాలో లేదో నిర్ణయించుకుంటామన్నారు. తెరాస ఎప్పటికైనా కాంగ్రెసులో కలుస్తుందని చెప్పారు. జగన్తో కుమ్మక్కు అయ్యే పరిస్థితి తమకు లేదన్నారు.