జగన్ అభ్యర్థి కృష్ణదాస్ ముందస్తు ఓటు, వివాదాస్పదం
ఆయన ఎనిమిది గంటల కంటే పది నిమిషాల ముందే తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పెద్ద యెత్తున ప్రచారం జరిగింది. ముహూర్తం బాగుందనే కారణంతో ఎన్నికల అధికారుల అనుమతి తీసుకొని ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు మండిపడ్డారు. పోలింగ్ ప్రారంభానికి ముందే ఓటేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
సంబంధిత ఎన్నికల అధికారిని తప్పించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దాడి డిమాండ్ చేశారు. ప్రారంభానికి ముందే ఓటేయడంపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కాగా కృష్ణదాసు ముందే ఓటేయడంపై ఈసి దృష్టికి తీసుకు వెళ్లగా ముందస్తు ఓటుపై జిల్లా కలెక్టర్ను వివరణ కోరతానని భన్వర్ లాల్ తెలిపారు. అనంతరం ఉప ఎన్నికలపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన భన్వర్ లాల్.. కృష్ణదాసు పోలింగ్ కేంద్రానికి ముందుగా వచ్చినా 8 గంటలకే ఓటు వేశారని వివరణ ఇచ్చారు.
ముందస్తుగా ఓటేసేందకు ఎవరికీ అవకాశం ఉండదని విశ్రాంత ఎన్నికల అధికారి కెజె రావు ఢిల్లీలో అన్నారు. ముందస్తు ఓటు నిర్ధారణ ఏజెంట్ల ద్వారానే చేసుకోవచ్చునని చెప్పారు. ఈవిఎంలో ఓటింగ్ సమయం నమోదు కాదని తెలిపారు. ముందస్తుగా ఓటును రద్దు చేసే అధికారం ఈసికి ఉందన్నారు. ముందస్తుగా పోలింగ్ జరిగితే అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయని, వాణిజ్య ప్రకటన ద్వారా పార్టీ గుర్తు ప్రచారంపై ఈసి వెంటనే స్పందిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.