జులై 19న రాష్ట్రపతి ఎన్నిక, 22 ఫలితం విడుదల
నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 30 చివరి తేదీ. స్క్రూటినీ వచ్చే నెల 2వ తేదీన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 4. ఓట్ల లెక్కింపు జూలై 22వ తేదీన జరుగుతుంది. అదే రోజు ఫలితం వెలువడుతుంది.
ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పదవీ కాలం జూలై 24వ తేదీతో ముగుస్తుంది. గతంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికకు జూన్ 13వ తేదీన నోటిఫిటేషన్ జారీ అయింది. యుపిఎ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేరు వినిపిస్తోంది. జస్వంత్ సింగ్ ఉపాధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్సీపి నేత పిఎ సంగ్మా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీకి మద్దతుగా కాంగ్రసు పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెసు నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సానుకూలంగా మలిచేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.