కేంద్రం అభ్యర్థన: ఎపి హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నో
ఐఐటి విద్యార్థుల ప్రవేశానికి ఆటంకం కలుగకుండా ఉండటానికి తాము స్టే ఇవ్వలేమని సుప్రీం తేల్చి చెప్పింది. మతం ఆధారంగానే ఉప కోటా ఇచ్చారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఉప కోటు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొంది. బిసిలకు ఇస్తున్న 27 శాతం రిజర్వేషన్లో ఏ ఆధారంగా 4.5 శాతం ఉప కోటా నిర్ణయించారని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.
రాజ్యాంగ నిబద్దత ఏమిటో కూడా తెలపాలని కోరింది. జాతీయ బిసి, మైనార్టీ కమిషన్లను సంప్రదించారా అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగ సంబంధమైన విషయాలలో కేంద్రం స్పష్టంగా ఉండాలని కోర్టు సూచించింది. అయితే ఉపకోటాపై విచారణకు కోర్టు అంగీకరించి ప్రతివాదులకు, ప్రభుత్వానికి నోటీసులు పంపింది.
కాగా గతంలోనే మైనార్టీల రిజర్వేషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. మైనార్టీల జనాభా ఆధారంగానే 4.5 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రిజర్వేషన్ కేటాయింపును కొట్టివేయడంపై తాము సుప్రీంను ఆశ్రయిస్తామని చెప్పారు.