ప్రణబ్ మంట: మమతా బెనర్జీతో కాంగ్రెసు కటీఫ్?
రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జీకి వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను కాంగ్రెసు ముమ్మరం చేసింది. అయినా మమతా బెనర్జీ తన పట్టును వీడడం లేదు. అబ్దుల్ కలాం అభ్యర్థిత్వానికి మాత్రమే అంగీకరిస్తామని ఆమె కుండబద్దలు కొట్టారు. అయితే తాము కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయబోమని ఆమె చెప్పారు. తమంత తాముగా యుపిఎ నుంచి వైదొలగబోమని ఆమె గురువారం చెప్పారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్తే తాము యుపిఎ నుంచి తప్పుకుంటామని ఆమె అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక దేశగౌరవానికి సంబంధించిందని, కలాం ఎన్డీయె అభ్యర్థి కారని, అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి అని ఆమె అన్నారు. అన్ని పార్టీలు కలాం పేరును అంగీకరించాలని ఆమె అన్నారు. రాష్ట్రపతి పదవికి తొలి ప్రత్యామ్నాయం కలాం మాత్రమేనని ఆమె అన్నారు. బెదిరింపులకు భయపడబోమని ఆమె అన్నారు. బెదిరింపులను తాము సమర్థంగా ఎదుర్కుంటామని ఆమె అన్నారు. యుపిఎ నుంచి తమను బయటకు పంపితే తగిన పరిణామాలుంటాయని ఆమె అన్నారు. తాను సాధారణమైన వ్యక్తినని ఆమె అన్నారు.
ఇదిలా వుంటే, రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీకి ఆర్జెడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ మద్దతు ప్రకటించారు. ఎన్సీపి నేత శరద్ పవార్ గురువారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. యుపిఎ అభ్యర్థికి తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.
కాగా, ప్రణబ్ ముఖర్జీ సిపిఎం నాయకులతో మాట్లాడారు. మమతా బెనర్జీకి చెక్ చెప్పేందుకే ఆయన సిపిఎం మద్దతు కోరినట్లు చెబుతున్నారు. మమతా బెనర్జీ యుపిఎ నుంచి తప్పుకున్నా తమకు ఇబ్బంది లేదని కాంగ్రెసు వర్గాలంటున్నాయి. ఆమెతో తెగదెంపులు చేసుకునే దిశగా కూడా కాంగ్రెసులో ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జీ పేరును తప్ప మరో పేరును అంగీకరించడానికి కాంగ్రెసు సిద్ధంగా లేదని అంటున్నారు. కాగా, బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సమావేశమై రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో యుపిఎ ఏకాభిప్రాయం సాధించలేకపోయిందని, గతంలో ఎన్నడూ లేనంతగా భిన్నాభిప్రాయాలున్నాయని అద్వానీ అన్నారు.