నిత్యానందస్వామికి రిలీఫ్, బెయిల్: సిఎంపై పరువు నష్టం
గురువారం నిత్యానందను పోలీసులు రామనగర్ కోర్టులో హాజరుపర్చారు. నిత్యానందను కోర్టుకు తీసుకు వస్తున్న విషయం తెలిసి అతనిని చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు. దీంతో కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు ఆవరణలో పోలీసులు ఆంక్షలు విధించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిత్యానందను కోర్టులో ప్రవేశ పెట్టారు. అనంతరం కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు తన బిడది ఆశ్రమంలో సోదాల నిర్వహణపై నిత్యానంద స్వామి హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ముఖ్యమంత్రి సదానంద గౌడ, డిజిపి, చీఫ్ సెక్రటరీలపై నిత్యానంద పరువు నష్టం దావా వేశారు.
కాగా నిత్యానంద స్వామి బుధవారం కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. నిత్యానంద బుధవారం బెంగళూరులోని రామనగర్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. కోర్టులో లొంగిపోయిన అనంతరం ఆయన రామనగర్ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మీడియాపై దాడి కేసులో పోలీసులు నిత్యానంద స్వామిపై ఇటీవల కేసు నమోదు చేశారు. ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. దాడి అనంతరం నిత్యానంద అదృశ్యమయ్యాడు. నాలుగు రోజులుగా ఎవరికీ కనిపించకుండా కలుగులోకి వెళ్లిపోయారు.
దీంతో అతని కోసం పోలీసులు గాలించారు. అయితే బుధవారం ఆయనే స్వయంగా కోర్టుకు వచ్చి లొంగిపోయారు. ఆయనపై దౌర్జన్యం, అత్యాచారం కేసులు నమైదయ్యాయి. మరోవైపు మంగళవారం హైకోర్టులో నిత్యానంద ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కోర్టు విచారణను వాయిదా వేసింది. నిత్యానందకు రామనగర్ కోర్టు ఒకరోజు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం గురువారం బెయిల్ మంజూరు చేసింది.