బొత్స సత్తిబాబును లాగిన ఐఎఎస్ అధికారి ఎల్వీ
ఎపిఐఐసి గోల్ఫ్కోర్సు ద్వారా రావాల్సిన వార్షికాదాయం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం బొత్సకు తెలుసునని చెప్పారు. ఆ ఫైలుపై బొత్స సంతకం చేశారన్నారు. ఎల్వీపై ప్రాసిక్యూషన్ అక్కర్లేదని సీబీఐకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నెల 5న లేఖ రాయడం తెలిసిందే. దాని ఆధారంగా తనపై నమోదైన కేసును తొలగించాలని ఎల్వీ కోరారు. ఈ సందర్భంగా ఆయన కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ వివరాలు వెలుగుచూశాయి.
ఎమ్మార్ ప్రాజెక్టును పర్యవేక్షించిన సమయంలో ఎపిఐఐసికి బీపీ ఆచార్యకు ముందు ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎండీగా ఉన్నారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ప్రభుత్వ లావాదేవీలపై సిబిఐ దృష్టి సారించింది. అందులో భాగంగా ఎల్వీపై సిబిఐ కొన్ని అభియోగాలు చేసింది. అప్పట్లో రూ.40 లక్షలు ఉన్న ఎకరా ధరను ఎమ్మార్కు రూ.29 లక్షలకే కేటాయించారని, దాని వెనుక లోపాయికారి ఒప్పందాలున్నాయని సిబిఐ ఆరోపించింది. ఇక గోల్ఫ్కోర్టు నిర్మాణానికి ఇచ్చిన 235 ఎకరాల లీజులో మతలబులు జరిగాయని పేర్కొంది. గోల్ఫ్ కోర్టు పూర్తయ్యాక దాని వార్షికాదాయంలో మొదటి 33 ఏళ్ల వరకు రెండు శాతం, తర్వాతి 33 ఏళ్లకు మూడు శాతం ఎపిఐఐసికి రావాలన్నది నిబంధన.
కాగా, ఎల్వీ హయాంలో ఈ నిబంధనలో మార్పులు జరిగాయని సిబిఐ ఆరోపించింది. ఈ అభియోగాలపై ప్రభుత్వం ఎల్వీ నుంచి వివరణ తీసుకుంది. ఆ ఒప్పందం అప్పటి మంత్రికి తెలుసునని, ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించిందని ప్రధాన కార్యదర్శికి చెప్పారు. మణికొండ వద్ద గోల్ఫ్కోర్సు నిర్మాణం పూర్తయ్యాక దాని ద్వారా వచ్చే వార్షికాదాయంలో మొదటి 33 ఏళ్ల వరకు రెండు శాతం, తర్వాత 33 ఏళ్ల వరకు మూడు శాతం ఏపీఐఐసీకి ఎమ్మార్ చెల్లించాలని ఉందని ఎల్వీ చెప్పారు.
అలాగే ఏపీఐఐసీ భూమి ధరల నిర్ణాయక కమిటీ ఎకరాను రూ.40 లక్షలకు విక్రయించాలని చెప్పిందని, కానీ, ఎమ్మార్ ప్రాజెక్టు వ్యయం విలువ రూ.430 కోట్ల నుంచి రూ.630 కోట్లకు పెరగడం, ప్రాజెక్టులో ప్రభుత్వం తన వాటాను 46 శాతం నుంచి 26 శాతానికి తగ్గించుకున్న నేపథ్యంతో ప్రభుత్వం ఆలోచించి భూమి ధరను నిర్ణయించిందని అని ఎల్వీ వివరించారు.
రెండో విడత 33 ఏళ్ల లీజుకు ఇచ్చే సందర్భంలో ఎమ్మార్ చెల్లించే ఆదాయాన్ని తగ్గించిన అంశంపై ఫైల్ తయారు చేశారని, దానిపై అప్పటి పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన మంత్రి సంతకం చేశారని, దాన్ని ప్రభుత్వం ఆమోదించిందని, అందులో నా తప్పేం లేదని ఎల్వీ వివరణ ఇచ్చారు. నిజానికి గోల్ఫ్కోర్సు ఆదాయం ఎస్పీవీకి వెళుతుందనే విషయాన్ని సిబిఐ సరిగ్గా అర్థం చేసుకున్నట్లు లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఏదైనా నష్టం వ స్తుందని సీబీఐ భావించినా అది రెండోవిడత లీజుకు ఇస్తేనే జరిగే అవకాశం ఉందన్నారు. ఎల్వీ వివరణను పరిశీలించిన ప్రభుత్వం ఇందులో ఆయన తప్పిదం లేదని సీబీఐకి లేఖ రాసింది. ఆయనను ప్రాసిక్యూట్ చేయనవసరం లేదని తెలిపింది.