బొత్స విచారణకు పిటిషన్: ధర్మాన తనయుడికి ప్రశ్నలు
మద్యం సిండికేట్ల వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాద రావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడిని ఎసిబి అధికారులు సోమవారం ప్రశ్నించారు. దాదాపు ఐదు గంటల పాటు మనోహర్ నాయుడిని ఎసిబి అధికారులు విచారించారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో రామ్ మనోహర్ నాయుడిని ఎసిబి అధికారులు ప్రశ్నించారు. తనకు ఒక తప్పుడు ఫోన్ కాల్ వచ్చిందని విచారణ అనంతరం రామ్ మనోహర్ నాయుడు విచారణ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తాను గ్రానైట్ వ్యాపారిని అని, మద్యం వ్యాపారంతో తనకు గానీ తన కుటుంబానికి గానీ ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు. మిగిలిన విషయాల కోసం ఎసిబిని అడగాలని ఆయన మీడియా ప్రతినిధులకు సూచించారు. అయితే, తాము తప్పు కాల్ చేయలేదని ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. మద్యం సిండికేట్ వ్యాపారి ఓరుగంటి ఈశ్వర రావును కూడా ఈ కేసులో విచారించినట్లు ఆయన తెలిపారు. అవసరమైతే రామ్ మనోహర్ నాయుడిని మరోసారి విచారణకు పిలుస్తామని ఆయన చెప్పారు
ఇదిలా ఉంటే, ఖమ్మం జిల్లా మద్యం సిండికేట్ వ్యాపారి నున్న వెంకటరమణ సోమవారం ఉదయం వరంగల్ జిల్లాలోని ఎసిబి డీఎస్పీ ముందు హాజరయ్యారు. మద్యం సిండికేట్ వ్యవహారాలపై వెంకటరమణను ఎసిబి ప్రశ్నించింది. ఆయనతో పాటు 10 మంది మద్యం వ్యాపారులు ఎసిబి ముందు హాజరయ్యారు. మరోవైపు మద్యం సిండికేట్ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది.
ఇప్పటి వరకు మద్యం సిండికేట్లు, ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించిన ఎసిబి సోమవారం నుంచి ప్రజాప్రతినిధులను విచారించనుంది. ఈనెల 18, 19, 20 తేదీల్లో హాజరుకావాలని పలువురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఎసిబి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే కవిత, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, సిపిఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన చెన్నకేశవరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ తదితరులు ఎసిబి విచారణకు హాజరుకానున్నారు.