మందా వర్సెస్ మంత్రి డికె అరుణ: బొత్సకు తలనొప్పి
అయితే ఆదివారం జరిగిన ఘర్షణకు కారణమైన ఎమ్మెల్సీ విష్ణువర్థన్పై చర్య తీసుకుంటే ఫిర్యాదును వెనక్కి తీసుకునే సంగతి ఆలోచిస్తానని మందా జగన్నాథం చెప్పారు. దీనితో సమస్య మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. మంత్రి అరుణ దళిత వ్యతిరేకి అంటూ, తనపై హత్యాయత్నానికి పురిగొల్పారంటూ మందా జగన్నాథం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాన్ని ఉప సంహరించుకోవాలని సోమవారం ఉదయం బొత్స ఆయనకు ఫోన్ చేశారు.
ఆ విషయాన్ని మందా జగన్నాథం నిర్థారిస్తూ, విష్ణువర్థన్పై చర్య తీసుకుంటే ఫిర్యాదు ఉప సంహరణ గురించి ఆలోచిస్తానని మీడియా ప్రతినిధులతో చెప్పారు. మరో వైపు ఈ ఘటనపై బొత్స సత్యనారాయణ నిజ నిర్థారణ కమిటీ ఏర్పాటు చేశారు. సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఆయన డిసిసి అధ్యక్షుడిని ఆదేశించారు.
డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఒబేదుల్లా కొత్వాల్ ప్రమాణ స్వీకారానంతరం ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా మంత్రి డికె అరుణ, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మందా జగన్నాథంకు మద్దతుగా చేరిన కార్యకర్తలను ఎమ్మెల్సీ విష్ణువర్థన్ అడ్డుకోవడంతో తలెత్తిన ఘర్షణ చినికి చినికి గాలివానలా మారింది.
అనంతరం జగన్నాథం ఎస్పీని కలిసి మంత్రి డికె అరుణపై ఫిర్యాదు చేశారు. అరుణను దళిత వ్యతిరేకిగా అభివర్ణిస్తూ ఆమె తనపై హత్యాప్రయత్నం చేయించినట్లు ఆరోపించారు.