కల్యాణ్, శింగనమల రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
వారు తమకు ముందస్తు బెయిల్ కావాలని నాంపల్లి నాలుగో మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఫిర్యాదులను పరిశీలించి ప్రాథమిక ఆధారాలు లభించాకే కేసు నమోదు చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి బెయిల్ ఇవ్వొద్దని సిఐడి తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.
తెలుగు సినీ నిర్మాతలు సింగనమల రమేష్, సి. కళ్యాణ్లపై, ఆంజనేయులు గుప్తాపై సిఐడి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.భాను కిరణ్తో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లకు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల మీద వారిపై సిఐడి కేసులు నమోదు చేసింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సిఐడి వారిపై కేసులు నమోదు చేసింది. సి. కళ్యాణ్పై నిర్మాత నట్టి కుమార్ సిఐడికి ఫిర్యాదు చేశారు.
నట్టి కుమార్ ఈ వ్యవహారంలో సిఐడి ముందు కూడా హాజరయ్యారు. వీరిరువురు పరస్పరం తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నారు. భాను కిరణ్తో కలిసి సి.కళ్యాణ్, సింగనమల రమేష్ పలు దందాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సూరి హత్యకు శింగనమల రమేష్ సమక్షంలోనే భాను కిరణ్ టెస్ట్ ఫైరింగ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కాగా ఇటీవల నట్టి కుమార్ సి కల్యాణ్పై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. నిర్మాత సి. కళ్యాణ్ భానుకు బినామీయే అని నొక్కి చెప్పారు. సి. కళ్యాణ్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. వీరిద్దరు అక్రమ డాక్యుమెంట్లతో బ్యాంకులకు కోట్లకు టోకరా వేశారని నట్టి ఆరోపించారు.