భాను కిరణ్ లింక్స్: డిజిపిని కలిసిన అల్లు అరవింద్
నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కొద్ది ప్రముఖ నిర్మాతలపై, ఫైనాన్షియర్లపై కేసులు నమోదు చేశారు. అల్లు అరవింద్తో పాటు నిర్మాతలు కె. అశోక్ కుమార్, ఎంఎల్ కుమార్ చౌదరి డిజిపి వి. దినేష్ రెడ్డిని, సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్వీ రమణమూర్తిని కలిశారు. ఫిల్స్ చేంబర్స్ తరఫున వారు పోలీసు ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యను వివరించారు.
కేసులు నమోదు చేయడానికి ముందు చిత్ర పరిశ్రమ ప్రముఖులపై వచ్చిన ఫిర్యాదుల మంచీచెడులను పరిశీలించాలని వారు కోరారు. నట్టి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు నిర్మాతలు సి. కళ్యాణ్, సింగనమల రమేష్, ఆంజనేయ గుప్తాలపై కేసులు నమోదు చేశారు. నట్టి కుమార్ మరింత మందిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతుననారు.
పంపిణీదారులకు, నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు మధ్య వివాదాలు అతి సాధారణమని నిర్మాతలు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటేనే కేసులు నమోదు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీసు ఉన్నతాధికారులను కలిసి వివరించిన విషయాలపై నిర్మాతలు పెదవి విప్పడం లేదు.