పార్లమెంటు భవనంలోని నార్త్ బ్లాక్లో అగ్ని ప్రమాదం
అగ్ని ప్రమాదం సంభవించిన కాసేపట్లోనే మంటలు బాగా ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో పలు ఫైళ్లు దగ్ధమైనట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు రావడంతో అందరూ బయటకు వచ్చారు. కాగా నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలోని మంత్రాలయలోనూ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర రాజధాని ముంబై సచివాలయంలో గత గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను ఆర్పడానికి 25 ఫైర్ టెండర్స్, 3 అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు మహారాష్ట్ర సహాయ మంత్రి, ఎన్సీపి నాయకుడు బాబన్ రావు పచుపుటే కేబిన్ నుంచి ప్రారంభమైనట్లు అనుమానించారు.
నాలుగో అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది బయటకు పరుగులు పెట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావించారు. మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచన మేరకు భవనాన్ని ఖాళీ చేయించారు. మంత్రాలయ విభాగంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఫైర్ టెండర్లు చేరుకోవడంతో ప్రమాద నష్టం ఎక్కువగా జరగలేదని చెప్పారు. ఫైరింజన్ల రాకకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ను పౌరులు కూడా స్వచ్ఛందంగా నియంత్రించారు.
కాగా గంటపాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది పార్లమెంటు భవనంలోని నార్త్ బ్లాక్లో చెలరేగిన మంటలను ఆర్పి వేశాయి. ప్రమాదంలో ఎటువంటి కీలక పత్రాలు దగ్ధం కాలేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కేబుల్సు మాత్రమే దగ్ధమయ్యాయని అధికారులు చెబుతున్నారు.