86 గంటల ప్రయాస: బోరుబావిలో పడిన చిన్నారి మృతి
కాగా మహి బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో బోరు బావిలో పడింది. పుట్టిన రోజు సందర్భంగా అడుకుంటానని వెళ్లిన ఆమె కొంతదూరంలో ఉన్న బోరుబావిలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు ఆర్మీయే రంగంలోకి దిగింది. తొలుత ప్రతి ప్రయత్నానికి ఏదో ఒకటి అడ్డు తగిలినప్పటికీ మహిని మాత్రం బయటకు తీశారు. మహి దాదాపు 70 అడుగుల లోతులోని బోరు బావిలో ఇరుక్కు పోయింది.
చిన్నారిని ప్రాణాలతో ఉంచేందుకు బావిలోకి ఆక్సిజన్ పంపించారు. మహిని కాపాడేందుకు ఆర్మీ ఇంజనీర్లు, జాతీయ భద్రతా దళం కమెండోలు, పోలీసులు, గుర్గావ్ మెట్రో రైలు ఇంజనీర్లు ఇలా మొత్తం వందమందికి పైగా రంగంలోకి దిగారు. ఆ బోరు బావికి ఎనిమిది అడుగుల దూరంలో మరో బోరు బావిని తవ్వారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ రెండింటి మధ్య సొరంగం తవ్వుతుండగా పెద్ద రాయి అడ్డు వచ్చింది.
దాంతో శనివారం మరో సొరంగం తవ్వారు. మళ్లీ రాయి వచ్చినా.. దానిని డ్రిల్లింగ్ మెషీన్లతో పగలగొట్టేందుకు ప్రయత్నించి చేతులెత్తేశారు. దీంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్కు చెందిన ప్రత్యేక నిపుణులతో మరో బోరు బావి తవ్వారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని మానేసర్ పట్టణం సమీపాన కషాన్ గ్రామంలో జరిగింది. చిన్నారిని రక్షించేందుకు సైన్యం, అగ్నిమాపక, పోలీసు, ఆరోగ్య, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మహిని తీసినప్పటికీ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.