బాబు, రామోజీరావులపై సాయిరెడ్డి పరువు నష్టం దావా
తమపై వారు అసత్య ఆరోపణలతో పోస్టర్ విడుదల చేశారని సాయి రెడ్డి పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు, పోస్టర్ విడుదల చేసిన దాడి వీరభద్ర రావు పైన, ప్రచురించిన రామోజీ రావు పైన ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అసత్య కథనాలు ప్రచురించారని, వారిపై వెంటనే కేసు నమోదు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా విజయ సాయి పరువు నష్టం కోరారు.
వారి పైన ఐపిసి 499, 500ల సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయాలన్నారు. కాగా ఇటీవల దాడి వీరభద్ర రావు విజయ సాయి రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్, ఆయన బంధువులు, బినామీల ఆధీనంలో రాష్ట్రంలో 2.75 లక్షల ఎకరాల భూములు, గనులు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్ర రావు పోస్టర్ విడుదల సమయంలో చెప్పారు. ఇవి ఆక్రమించుకొన్నవి కావని, ప్రభుత్వం ద్వారా అధికారికంగా కేటాయింపజేసుకొన్నవని వీటిలో ఇనుప ఖనిజం, బెరైటీస్, సున్నపురాయి తదితర ఖనిజ నిల్వలున్న గనుల విస్తీర్ణం 1.80 లక్షల ఎకరాలని, వివిధ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం నుంచి తీసుకొన్న ఇతర భూములు 95 వేల ఎకరాలు అని ఆయన చెప్పారు.
తన ఆరోపణకు మద్దతుగా ఈ భూములు పొందిన వ్యక్తులు, సంస్థల జాబితాను, రాష్ట్రంలో ఏ జిల్లాలో వీటిని పొందారో వివరించే చిత్రపటాన్ని కూడా ఆయన విడుదల చేశారు. తమ ఆధీనంలో ఉన్న గనుల ద్వారా జగన్ బృందం రాబోయే 15 ఏళ్లలో రూ.16 లక్షల కోట్ల ఆదాయం గడించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ పోస్టర్లోనే విజయ సాయి రెడ్డికి సంబంధించిన వివరాలను కూడా దాడి విడుదల చేశారు.