జగన్ అరెస్టు తప్పన్న సోనియా: పాల్వాయి, చిరుపై...
ఎవరైనా అలా ఎందుకు గైడ్ చేశారో అర్థం కాలేదని, ఆ అరెస్టు తప్పనే అభిప్రాయంతో సోనియా ఉన్నారన్నారు. జగన్ను అరెస్టు చేయటం ద్వారా అనవసరంగా సానుభూతి పొందే అవకాశం కల్పించినట్లు అయిందన్నదే ఆమె అభిప్రాయమని పాల్వాయి పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని మేడమ్కు వివరించానని చెప్పారు. తెలంగాణపై కూడా సోనియా సానుకూలంగా ఉన్నారని, దానిపై అధిష్ఠానంలో తీవ్ర చర్చ జరుగుతోందని, రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే నిర్ణయం వస్తుందని అన్నారు.
తెలంగాణకు విలన్ కాంగ్రెస్సే అన్న కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె కేశవ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన ఆవేశంతో ఏదేదో అనేస్తారని, అలా అనకుండా ఉండాల్సిందన్నారు. ఎవరైనా సరే హద్దుల్లో ఉండాలని సూచించారు. తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేయాల్సి ఉందని, కానీ పార్లమెంటు సభ్యులు అలా చేయలేకపోయారని విమర్శించారు. గెలిచిన రెండు సీట్లు కూడా అభ్యర్థుల వ్యక్తతిగత బలంతోనే సాధ్యమైనట్లు చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్ర పరిస్థితులను సరిదిద్దాలన్న ఉద్దేశ్యంతో అధిష్టానం ఉందన్నారు. అనంతపురం నుండి గుంటూరు దాకా పార్టీ బాగా దెబ్బతిన్నదన్నారు. తెలంగాణపై సోనియా పాజిటివ్గా ఉన్నారని చెప్పారు. జగన్ను తామేం తక్కువగా అంచనా వేయడం లేదన్నారు. ఉప ఎన్నికలకు ముందు జగన్ అరెస్టు దురదృష్టకరమని చెప్పినప్పటికీ, ఆయన అరెస్టుపై మాత్రం పశ్చాత్తాపం ఏమీ వ్యక్తం చేయడం లేదన్నారు.
రామచంద్రాపురం, నరసాపురంలలో తన వల్లే గెలిచిందన్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. పార్టీ గెలుపునకు చిరంజీవి ఒక్కరే కారణమని తాను భావించడం లేదన్నారు. కిందిస్థాయి నుండి పార్టీని పటిష్టం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. నాయకత్వ మార్పుకు ఆస్కారాలు లేవన్నారు.