భాను కిరణ్కు కర్ణాటక మాజీ సిఎం చేయూత?
హైదరాబాద్లోని ఖాజాగూడలో సుమారు రూ.75 కోట్ల విలువచేసే భూమి ఓ సినీ నిర్మాత పేరుతో పెట్టినట్లు మూడో రోజు కస్టడీలో వెల్లడించిన భానుకిరణ్ తాజాగా బెంగళూరులోని ఆస్తుల చిట్టా విప్పినట్లు వార్తలు వచ్చాయి. నాలుగు రోజుల కితం కస్టడీకి తీసుకొని భాను, కృష్ణను విచారిస్తున్న సిఐడి అధికారులు వీరి బినామీ ఆస్తులను రట్టుచేసే పనిలో పడ్డారు. చిత్రపురి కాలనీకి సమీపంలో ఉన్న ఐదెకరాల భూమి తనదేనని, ఓ సినీ నిర్మాత పేరుతో ఉంచానని భాను ఇప్పటికే బయటపెట్టినట్లు చెబుతున్నారు.
బెంగళూరులో ఉన్న ఆస్తుల్లో కొన్నింటి వివరాలను బుధవారం వెల్లడించినట్లు తెలిసింది. సూరి జైల్లో ఉన్నప్పుడు భాను ఇక్కడ పలు సెటిల్మెం ట్లు చేసి వసూలు చేసిన సొమ్ముతో బెంగళూరులో ఆస్తులు కూడ బెట్టాడు. బెంగళూరు శివార్లలో రూ.30 కోట్ల విలువ చేసే ఐదెకరాల భూమి తన బంధువుల పేర పెట్టినట్లు తెలిసింది.
దంతలూరి కృష్ణ, మధుమోహన్, స్నేహలతారెడ్డి, శ్రీకాంత్గౌడ్ తదితరులతో దందాలు చేయగా వచ్చిన సొమ్ములో కొంత మేర సూరి కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. ఇందులో సింహభాగం బెంగళూరులో ఆస్తులు పోగు చేసుకున్నట్లు తెలుస్తోంది. భాను ఇక్కడ ఏ సినీ నిర్మాతతో కలిసి సెటిల్మెంట్లు చేశారని చెబుతున్నారో అదే నిర్మాతకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఒకరితో సత్సంబంధాలున్నాయి. తరచూ ఆయన మాదాపూర్లో గెస్ట్హౌస్కు వస్తుంటారని భాను వెల్లడించినట్లు సమాచారం.
రాజకీయంగా ఆయన సహకారం ఉండటం వల్లే బెంగళూరులో ఆస్తులు పోగు చేసుకొన్నట్లు తెలిసింది. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో మంగళవారం అరెస్టయిన వంశీరెడ్డి పేరుతో బెంగళూరులోని గద్దెనహళ్లి ప్రాంతంలో సిమెంట్ ట్రేడింగ్ చేస్తున్నట్లు సీఐడీ కస్టడీలో భానుకిరణ్ వెల్లడించాడని భోగట్టా. వీనస్ ట్రేడర్స్ పేరుతో జరుగుతున్న ఈ ట్రేడింగ్తో పాటు, కోరమంగళ ప్రాంతంలో బినామీ పేరుతో భాను నిర్వహిస్తున్న హోటల్ ఏడాది టర్నోవర్ కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం.