అభిమానిగానే వచ్చా, అది చెప్పేందుకే వచ్చా: కిరణ్రెడ్డి
ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణ రావు, హీరో వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణ, స్టార్ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ... సినిమా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, గవర్నర్ను పిలవాలా.. వద్దా అని ఆలోచించాల్సి వస్తోందన్నారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పారు. సెక్యూరిటీ వాళ్లు అతి చేయడంవల్ల ఇబ్బందులకు గురైన వివిఐపిలకు తన బావ శోభన్ బాబు అభిమానుల తరఫున క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
రాముడు వనవాసానికి వెళ్లినా తిరిగి రాగానే ప్రజలు పట్టాభిషేకం చేశారని, శోభన్ నటనకు దూరమైనా ఆయన అభిమానులు ఇలాంటి వేడుక చేయడం ఆనందంగా ఉందన్నారు. దిలీప్ కుమార్ తర్వాత ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న నటుడు శోభన్ బాబు మాత్రమే అన్నారు. ఒకే ఏడాది ఎనిమిది శతదినోత్సవ చిత్రాలిచ్చిన హీరో అని ప్రశంసించారు. శోభన్ బాబు, తాను హీరోలు కాక ముందునుంచే మంచి మిత్రులమని, ఆయనతో తొలి పరిచయం రైల్లో జరిగిందని కృష్ణ చెప్పారు. తన తేనె మనసులు సినిమా గురించి చెబితే.. పెద్ద హీరో అవుతావని ఆశీర్వదించినట్లు తెలిపారు.
శోభన్ మంచి క్రమశిక్షణ గల వ్యక్తి అని, పక్కా ప్రణాళికతో జీవితాన్ని కొనసాగించి.. తన పిల్లలను సినిమాలకు దూరంగా పెంచారని కృష్ణం రాజు అన్నారు. ఎందరికో గుప్తదానాలు చేశారని, ఆయనలోని మంచిని పాటిస్తే అంతకుమించిన అభిమానం ఇంకేమీ ఉండదని సూచించారు. తమ సంస్థలో పది చిత్రాలకు పనిచేసిన శోభన్.. ఎప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదని, ఆయన నిర్మాతల హీరో అని రామానాయుడు చెప్పారు. తాను సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లాలనుకున్నప్పుడు ఆయనతో చెబితే.. ఇంకా కొన్ని సినిమాలు చేయాలని చెప్పారని, ఆ మాటమీదనే ఇంకా కొనసాగుతున్నానని హీరో వెంకటేశ్ చెప్పారు. శోభన్ బాబు చెప్పిన మాటల్ని నిత్యం స్మరించుకుంటానని శ్రీహరి అన్నారు.