కృష్ణా నీటి పోరు: కర్నూలు జిల్లా నేతలూ రెడీ
కృష్ణా జలాలను ముందుకు తమ జిల్లాకే ఇవ్వాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. తమకు నీరు ఇవ్వకుండా శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్కు నీరు ఇవ్వడం సరి కాదని వారన్నారు. డెడ్ స్టోరేజీ నుంచి నీటిని విడుదల చేయడాన్ని తాము అంగీకరించబోమని వారన్నారు. శ్రీశైలం నీటిని కర్నూలు జిల్లా అవసరాలకు మాత్రమే వాడాలని వారన్నారు. మూడు రోజుల క్రితం నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి కృష్ణా డెల్టాకు విడుదల చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణకు సాగు నీరు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం, నాయకన్ గూడెంలో ధర్నా చేపట్టారు.ప్రధాన రోడ్డుపై బైఠాయించి సీమాంధ్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణకు సాగునీరు ఇవ్వకుండా కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ నుంచి నీళ్లు వదలడాన్ని వారు తప్పుపట్టారు.
కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించబోమని, అయితే తెలంగాణకు తాగునీరు ఎలా ఇస్తారో చెప్పాలని తెలుగుదేసం నేత తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. సాగునీటి విడుదలపై వెంటనే ప్రభుత్వం అఖిల పక్షం ఏర్పాటు చేయాలని ఆయన సోమవారం ఖమ్మంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. కాగా, తెరాస వైఖరిని కాంగ్రెసు గుంటూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తీవ్రంగా తప్పు పట్టారు. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడాన్ని తెరాస నాయకులు వ్యతిరేకించడం సరైంది కాదని, ఈ సీజన్లో కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆయన అన్నారు.
నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదలను అడ్డుకోవడానికి తెరాస నాయకులు ప్రయత్నించారు కూడా. తెలంగాణకు అన్యాయం చేస్తూ కృష్ణా డెల్టాకు ప్రభుత్వం నీరు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందని వారు విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ తెలంగాణకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి రాజీనామా చేయాలని తెరాస శానససభ్యుడు హరీష్ రావు ఇటీవల డిమాండ్ చేశారు.