పాల్వాయికి అవమానం, రాహుల్ గాంధీ భేటీ రద్దు
అయితే, పాల్వాయికి ఇచ్చిన అపాయింట్మెంట్ను రాహుల్ గాంధీ రద్దు చేసుకున్నారు. తనతో సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగా మీడియాకు చెప్పినందుకు ఆగ్రహించిన రాహుల్ గాంధీ పాల్వాయికి అపాయింట్మెంటును రద్దు చేసినట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువజన కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీని కలిసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలోనే పాల్వాయికి అపాయింట్మెంట్ను రద్దు చేస్తూ రాహుల్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
రాహుల్ గాంధీ తనను ఢిల్లీకి అహ్వానించారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం హైదరాబాదులో మీడియాతో చెప్పారు. తాను రాహుల్ గాంధీని కలుస్తానో లేదో కూడా చెప్పలేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే పాల్వాయిని రాహుల్ ఢిల్లీకి ఆహ్వానించారని వార్తలు వచ్చాయి.
రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని కూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం వ్యాఖ్యానించారు. పార్టీని చక్కదిద్దడానికి సోనియా, రాహుల్, గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. మొత్తం మీద, ఎంతో ఆశతో ఢిల్లీ వెళ్లిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి నిరాశే ఎదురైంది.