ఎన్ఆర్ఐ భర్త, అత్తింటి వేధింపులు: యువతి ఆత్మహత్య
ఆనంద్ ఎంబిఏ చదివి అమెరికాలో ఉంటున్నాడు. విజయలక్ష్మి వివాహం అయినప్పటి నుంచే అత్త వారింట్లో భర్త, అత్త, మామ, మరుదుల నుండి వేధింపులు వచ్చాయి. ఆనంద్ మొదట ఆస్ట్రేలియాలో ఉండగా కొన్ని నెలల పాటు భార్యను అక్కడకు తీసుకు వెళ్లి కొద్దికాలానికే హైదరాబాద్ పంపించాడు. భార్యాభర్తలిద్దరూ సుమారు ఏడాదిన్నర పాటు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాత అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి.
విదేశాలలో ఉన్న భర్త ఏనాడు కూడా ఫోన్లో మాట్లాడే వాడు కాదు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం మాని అమెరికా వెళ్లి అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల రెండు నెలల క్రితం హైదరాబాద్ వచ్చిన ఆనంద్ భార్య వద్దకు రాలేదు. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆమె ఎక్కువగా పుట్టింట్లోనే ఉంటుండేది. గత నెల 24న భర్త అమెరికా వెళ్తుంటే విజయలక్ష్మి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లగా అక్కడ భర్త ఆమెను మాటలతో బాధపెట్టాడు.
తమ కుమారుడి పెళ్లికి రావడానికి అల్లుడు ఆనంద్కు రూ.లక్ష అడిగితే అత్తింటి వారు పంపించారు. అయినా అతను పెళ్లికి రాలేదు. దీంతో విజయలక్ష్మి మానసిక వేదనకు గురైంది. తల్లిదండ్రులు మంగళవారం శుభకార్యానికి వెళ్లి రాత్రి వచ్చి చూడగా తలుపులు బిగించి ఉన్నాయి. ఇంట్లో టివి పెద్దగా పెట్టి ఉంది. లోపలకు వెళ్లి చూడగా విజయలక్ష్మి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది. బుధవారం అత్తింటివారు రావడంతో స్థానికులు వారిపై దాడి చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామ, మరుదులపై కేసు నమోదు చేశారు.