పేకాట ఆడుతూ దొరికిన పులివెందుల టిడిపి నేత రవి
వీరితో పాటు అనేక రాజకీయ నాయకులు పోలీసుల చేతికి చిక్కారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఫిలింనగర్లో కొనసాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. 26 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 21.8 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
ఫిలింనగర్ కాలనీలో గత కొంతకాలంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో బంజారాహిల్స్ పోలీసులు, వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా గురువారం సాయంత్రం దాడి చేశారు. 26 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకోవడంతోపాటు పెద్ద మొత్తంలో నగదును, 28 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడకు వచ్చి పేకాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పేకాట రాయుళ్లలో అందరూ రాజకీయ నాయకులే. వీరిలో ఎక్కువమంది కడప జిల్లాకు చెందిన నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పట్టుబడ్డారు. బిటెక్ రవి గత ఉప ఎన్నికలలో పులివెందుల స్థానం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే వైయస్ విజయమ్మపై టిడిపి తరఫున పోటీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.