గాలి క్యాష్ ఫర్ బెయిల్ కేసు: మరో జడ్జిపై హైకోర్టు వేటు
విధుల్లో చేరేందుకు మధ్యలో ఎలాంటి సమయం తీసుకోకుండా వెనువెంటనే వెళ్లి చేరాలని, శ్రీకాకుళంలోని మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి నుంచి తన పోస్టుకు సంబంధించిన చార్జి తీసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు ముందుగా తన తండ్రి పట్టాభి రామారావును సంప్రదించినది ప్రభాకర రావేనని పట్టాభి కుమారుడు రవిచంద్ర ఎసిబికి గతంలో ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. గాలికి బెయిల్ ఇప్పిస్తే రూ.10 కోట్లు వస్తాయని ప్రభాకర రావు తనకు పదే పదే ఫోన్ల ద్వారా చెబుతున్నట్లు పట్టాభి తన కుమారుడికి చెప్పారు.
తర్వాత పట్టాభి, రవిచంద్ర కలిసి ఎర్రగడ్డలోని ఓ జ్యూస్ సెంటర్ వద్ద ప్రభాకర రావును కలిశారు. అక్కడ తొలుత ప్రభాకర రావు, పట్టాభి ఏకాంతంగా మాట్లాడుకున్నాక.. రవిచంద్ర వద్దకు ప్రభాకర్ వచ్చారు. గాలికి బెయిల్ ఇప్పిస్తే పది కోట్లు ఇస్తారని చెప్పారు. జీవితానికి ఒక్కసారే వచ్చే అవకాశమిదని, వదులుకోవద్దని సూచించారు. మీ నాన్న దీనికి ఒప్పుకోవడం లేదని చెప్పారు. ఈ మధ్యలోనే చలపతి కూడా ఒకసారి పట్టాభికి గాలి బెయిల్ గురించి ఆఫర్ చేశారు.
అయితే.. ప్రభాకర్ ఆఫర్లో మధ్యలో ఎప్పుడో ఒకసారి గాలి జనార్దన్ రెడ్డి బంధువులను పట్టాభి వ్యక్తిగతంగా కలవాల్సి ఉంటుంది. చలపతి ఆఫర్ ఐదు కోట్లే అయినా.. అందులో ఎవరినీ పట్టాభి కలవాల్సిన అవసరం లేదు. దాంతో డబ్బు తక్కువైనా రిస్క్లేని వ్యవహారమని చలపతి ఆఫర్నే పట్టాభి ఎంచుకున్నారు. బెయిల్ ఇస్తే రూ.5కోట్లు వస్తాయని చలపతి రావు చెప్పారని, ప్రభాకర్ రావు రూ.10 కోట్లు ఇస్తామన్నా, చలపతి రావు డీల్లో మనం ఇతరులెవరినీ వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేదని, రిస్క్ తక్కువని, అందుకే రూ.5 కోట్లకే ఒప్పుకున్నానని, డబ్బులు వస్తాయని, వాటిని లాకర్లలో పెట్టి తాళం చెవులు మనకు ఇస్తారని పట్టాభి తన కుమారుడికి వివరించారు.
కొంతకాలం తర్వాత పట్టాభి తనతో డీల్ కుదుర్చుకోకుండానే గాలికి బెయిల్ ఇవ్వడంపై ప్రభాకర్కు అనుమానం వచ్చింది. పట్టాభికి, రవిచంద్రకు ఫోన్లు చేసి మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు? అంటూ ప్రశ్నించారు. పట్టాభి గుడివాడకు వెళ్లినా వదల్లేదు. మే 23వ తేదీన పట్టాభి హైదరాబాద్లో ఓ డెంటిస్టు వద్దకు వెళ్లినప్పుడు ప్రభాకర్ కలిశారు. గాలికి బెయిల్ ఇప్పించేందుకు నిన్ను ఎవరు అప్రోచ్ అయ్యారో చెప్పమని, తమకు రావాల్సింది రాలేదని, ఇంకా చాలా విషయాల్లో మమ్మల్ని ఇలాగే మోసం చేశారని మా మీడియేటర్స్ అంటున్నారని ప్రభాకర్ హెచ్చరించినట్లు పట్టాభి తన కుమారుడికి చెప్పారు.