వారితో సంబంధంలేదు: బొత్స, వైయస్పై విహెచ్ సూచన
వివాదాస్పద జివోల వ్యవహారంలో సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందుకున్న నలుగురు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు, గీతారెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణలకు న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పొన్నాలకు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మోపిదేవికి సహాయం లేకపోవడంపై బొత్స స్పందించి, సిఎంకు లేఖ రాస్తానని ఈరోజు చెప్పారు. సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నానిలతో తమకు సంబంధం లేదని బొత్స అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో వారు ఎవరికి ఓటేస్తారో తమకు అవసరం లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలోపే పిసిసి కార్యవర్గ నియామకాలు ఉండవచ్చునని చెప్పారు.
కాగా గాంధీ భవనంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని కాంగ్రెసు పార్టీ సాదా సీదాగా నిర్వహించింది. పార్టీ కార్యాలయంలో వైయస్ చిత్రపటానికి ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్ బొత్స, మంత్రులు ముఖేష్ గౌడ్, ఎంపి కేవిపి రామచంద్ర రావు, సభాపతి నాదెండ్ల మనోహర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అసెంబ్లీ లాబీలో నిర్వహించిన వేడుకలలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
బొత్స అంతకుముందు పంజాగుట్టలోని వైయస్ విగ్రహానికి పూలమాల వేశారు. నగర పార్టీ కార్యాలయంలో దానం నాగేందర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివంగత వైయస్ పథకాలు అన్ని అమలు అవుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న వైయస్ ఆశయ సాధన కోసం పని చేస్తామన్నారు. వైయస్ మృతిని రాజకీయం చేయడం తగదన్నారు.
మరోవైపు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వైయస్ విషయంలో పార్టీకి సూచనలు చేశారు. వైయస్ను కాంగ్రెసు పార్టీ మరిచి పోవాలని చెప్పారు. ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. 26 జివోలపై అధికారులది తప్పే అన్నారు. వారికి న్యాయ సహాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. మంత్రులకు న్యాయ సహాయం అందించడం సరియైన చర్య అన్నారు. మోపిదేవికి ఎందుకు సహకరించలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు.