నన్ను అడ్డు పెట్టుకొని 10 కోట్లు వసూలు: తారాచౌదరి
ఇప్పటికే తాను డిజిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశానని, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తనను అడ్డం పెట్టుకొని పలువురిని బ్లాక్ మెయిల్ చేసి కొందరు రూ.పదికోట్ల వరకు వసూళ్లకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. తనను వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని తాను డిజిపిని కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తారా చౌదరి తనకు వచ్చిన కాల్స్ డేటాను డిజిపి ఆఫీసులో ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కాగా ఓ పార్లమెంటు సభ్యుడి వల్ల, ఏసీపీ వల్ల తనకు ముప్పు ఉందని అంటూ తనకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని (హెచ్ఆర్సీని) ఆశ్రయించిన వర్ధమాన నటి తారా చౌదరికి చుక్కెదురైన విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ను కమిషన్ తిరస్కరించింది. ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేసిన కేసులపై నాంపల్లి సివిల్ కోర్టులో విచారణ జరుగుతోన్న నేపథ్యంలో ఆమె పిటిషన్ను తీసుకోడానికి నిబంధనలు అంగీకరించవని హెచ్ఆర్సీ సభ్యుడు పెదపేరిరెడ్డి స్పష్టం చేశారు.
తాను జాతీయ మానవహక్కుల కమిషన్కు వెళ్తానని, తనకు కొందరి వల్ల ప్రాణభయం ఉందని తారా చౌదరి మీడియాతో చెప్పారు. ఓ ఎంపీపై ఫిర్యాదు చేసినందునే తన పిటిషన్ను నిరాకరించారని ఆరోపించారు. ఓ ఎసిపి, సిఐ, ఎమ్మెల్యేలపైనా ఆమె ఆరోపణలు చేశారు. వారి నుంచి రూ.25 లక్షలు పరిహారం ఇప్పించాలన్నారు. తనపై నమోదైన కేసులపై సీఐడీ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, తారా చౌదరి ఇటీవల ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆ పార్లమెంటు సభ్యుడి పేరును, శాసనసభ్యుడి పెరును వెల్లడించారు. తనను వాళ్లు వాడుకున్నారంటూ దమ్మెత్తిపోశారు. సెక్స్ రాకెట్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమె బెయిల్పై విడుదలైన చాలా రోజుల తర్వాత మీడియాకు ఎక్కారు. పలువురు పోలీసులపైనా ఆమె ధ్వజమెత్తారు.
తారా చౌదరి ఆరోపణలను పార్లమెంటు సభ్యుడు ఖండిస్తున్న నేపథ్యంలో తారా చౌదరి కాల్ లిస్టును ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో బయటపెట్టారు. దాంతో తనకు ప్రాణభయం ఉందంటూ ఆమె రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.