వివాదాస్పదమైన సీతారామాంజనేయులు ఎన్కౌంటర్లు
2002లో ఆ కర్నూలు, గుంటూరు జిల్లాలలో జరిగిన ఎన్కౌంటర్లపై జిల్లా మానవ హక్కుల వేదిక దాఖలు చేసిన పిటిషన్ పైన ఎన్హెచ్ఆర్సి పదేళ్లపాటు విచారణ చేపట్టింది. ఎన్కౌంటర్లు బూటకమని తేల్చింది. సీతారామాంజనేయులు హయాంలో గుంటూరులో ఆరు, కర్నూలులో పది ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ ఎన్కౌంటర్లలో మృతి చెందిన వారంతా బడుగు, బలహీన వర్గాల వారు, నిరుపేదలే అని ఎన్హెచ్ఆర్సి తెలిపింది. ఇవన్నీ ఏకపక్షంగా జరిగినట్లు భావిస్తోంది.
ఎన్హెచ్ఆర్సి ఆదేశాల మేరకు వెంటనే బాధితులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్కారు సూచనల మేరకు ఆయా జిల్లా తహశీల్దార్లు బాధితులకు చెక్కులను అందజేసినట్లుగా తెలుస్తోంది. సీతారామాంజనేయులు ఎన్కౌంటర్లపై గుంటూరు జిల్లా న్యాయవాది, మానవహక్కుల వేదిక కార్యకర్త చంద్రశేఖర్ ఎన్హెచ్ఆర్సికి ఫిర్యాదు చేశారు.
కాగా ఎన్హెచ్ఆర్సి ఇచ్చిన తీర్పును చంద్రశేఖర్ స్వాగతించారు. సీతారామాంజనేయులు 16 నకిలీ ఎన్కౌంటర్లకు పాల్పడ్డారని అందుకు 80 లక్షల నష్టపరిహారం బాధిత కుటుంబాలకు ఇవ్వాలని హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆయన తెలిపారు. ఈ నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించకుండా ఆయన నుంచే వసూలు చేయించి ఉండాల్సిందని ఆయన అన్నారు.