చొరవ కావాలి: భారత్ సంబంధాలపై హీనా రబ్బానీ ఖర్
అన్ని సమస్యలకూ పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని చెప్పారు. ఇప్పటి వరకు జరిగన ప్రయత్నాలు లక్ష్యాలు చేరుకునే వరకు సాగలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్, పాక్లు రెండు విశ్వాసంతో కూడిన సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రెండు దేశాల రాజకీయ నాయకత్వం సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రగాఢంగా కోరుకుంటున్నారని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.
సమీప భవిష్యత్తులో కొన్ని సమస్యలకైనా పరిష్కార మార్గాలు చూపగలమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు గతంలోనీ తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయని హీనా చెప్పారు. ఇప్పుడున్న సమస్యలు భవిష్యత్ తరాలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను చిత్తశుద్ధితో చేపట్టవలసి ఉందని చెప్పారు.
ఎస్ఎం కృష్ణ పాక్ పర్యటనకు సంబంధించిన కొత్త తేదీలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హీనా రబ్బానీ ఖర్ తెలిపారు. కాగా గత ఏడాది హీనా రబ్బానీ భారత దేశంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం తూర్పు ఏషియా సదస్సులో పాల్గొంటున్నారు.