సైకో సాంబ పరారీపై పోలీసులకు ఆనవాళ్లు లభ్యం
గొలుసును తెంపుకున్న సైకో కొండపల్లి ఖిల్లా నుంచి తప్పించుకుని చుట్టు ప్రక్కల గ్రామాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ సైకో కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాలుగైదు జిల్లాలను గడగడలాడిస్తున్న సైకో సాంబశివ రావు గురువారం సాయంత్రం పోలీసుల నుండి తప్పించుకొని పారిపోయాడు. గుంటూరు, కృష్ణా తదితర జిల్లాలలో సైకో సాంబశివ రావు ఆరు నెలలుగా అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.
చిన్న పిల్లల నుండి పెద్దల వరకు సాంబశివ అంటే భయం అలుముకుంది. చేతిలో ఉన్న దానితో దాడి చేసేవాడు. ఇతడు ఆరు నెలల్లో వందకు పైగా నేరాలు చేశాడు. ఇంతలా ప్రజలకు వణుకు పుట్టించిన సైకోను పోలీసులు వ్యూహాత్మకంగా బుధవారం కాకాని రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. అయితే అతను చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. అతను చేసిన నేరాల చిట్టాను విప్పేందుకు పోలీసులు గురువారం అతనిని విచారించారు. అయితే కొండపల్లి ఖిల్లా ప్రాంతంలో సొమ్ము దాచానని చెప్పి పోలీసులను అక్కడకు తీసుకు వెళ్లాడని తెలుస్తోంది.
కొండపల్లి ప్రాంతంలో ఓ చోట తాను సొమ్మును దాచానని చెప్పడంతో పోలీసులు అక్కడ సోదాలు ప్రారంభించారు. సైకోను కొండపల్లి కొండల ప్రాంతానికి తీసుకు వెళ్లినప్పుడు అతని చేతిలకు బేడీలు వేశారు. అతని వెంట ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు సిఐలు, పదిమంది కానిస్టేబుల్స్ ఉన్నారు. అయితే ఈ సైకో వారి కళ్లు గప్పి పారిపోయాడు. కొండపల్లి ఖిల్లాలో పోలీసులు సొమ్ము కోసం చూస్తుండగా అతను వారి నుండి తప్పించుకొని పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సైకోను వెతకడం కోసం పోలీసులు కొండపల్లి ఖిల్లాను మొత్తం చుట్టుముట్టారు.